Telugu Gateway
Telangana

మల్లు స్వరాజ్యం మృతి

మల్లు స్వరాజ్యం మృతి
X

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 91 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో హైద‌రాబాద్ లోని కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్ప‌త్రిలోనే ఆమె తుది శ్వాస విడిచారు. మ‌ల్లు స్వ‌రాజ్యం అంత్య‌క్రియ‌లు ఆదివారం నాడు న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో నిర్వ‌హిస్తామ‌ని సీపీఎం న‌ల్ల‌గొండ కార్య‌ద‌ర్శి ఎం. సుధాక‌ర్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళ మల్లు స్వరాజ్యమే. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదల పక్షాన నిలబడిన నాయకురాలు స్వరాజ్యం . నైజం గుండాలకు వ్యతిరేకంగా సాయుద పోరాటం చేసిన యోధురాలుగా మల్లు స్వరాజ్యం నిలిచారు.

అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపు తో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యం కు ఒక కూతురు ఉన్నారు.

Next Story
Share it