Telugu Gateway
Telangana

'లిక్క‌ర్ స్కామ్' పై రేవంత్ మౌనం వెన‌క మ‌త‌లబు ఏమిటి?!

లిక్క‌ర్ స్కామ్ పై రేవంత్ మౌనం వెన‌క మ‌త‌లబు ఏమిటి?!
X

ముఖ్య‌మంత్రి కెసీఆర్..ఆయ‌న కుటుంబంపై ఛాన్స్ దొరికితే చాలు విమ‌ర్శ‌లు గుప్పించే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపిన లిక్క‌ర్ స్కామ్ పై ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు విప్ప‌లేదు. కాంగ్రెస్ నేత‌లు చాలా మంది దీనిపై మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ వార్త ప్ర‌చురితం అయ్యే స‌మ‌యానికి కూడా స్పందించ‌లేదు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో బిజెపి ఎంపీ స్వ‌యంగా సీఎం కెసీఆర్ కుమార్తె పేరును తెర‌పైకి తేవ‌టంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్సీ క‌విత ఖండించారు. ఆరోప‌ణ‌లు చేసిన వారిపై కేసులు పెట్టారు...ప‌రువు న‌ష్టం దావాలు వేశారు. అయినా స‌రే బిజెపి నేత‌లు మాత్రం సీబీఐ విచార‌ణ‌లో క‌విత ఉన్నారో లేరో బ‌య‌ట‌కు వ‌స్తుంది... అప్ప‌టివ‌ర‌కూ ఆగండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ నాయ‌కులు త‌మ‌కు అనుమానం వ‌స్తే చాలు ఆరోప‌ణ‌లు గుప్పిస్తారు.

ఇందులో పెద్ద‌గా ఏ పార్టీకి మిన‌హాయిపు ఉండ‌దు. అంతే కానీ..నిజానిజాలు నిర్ధారించుకున్న త‌ర్వాత మాత్ర‌మే మాట్లాడాల‌నే సంప్ర‌దాయం ఎప్పుడో వ‌దిలేశారు. కానీ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ లిక్క‌ర్ స్కామ్ ఆరోప‌ణ‌లై మౌనం దాల్చ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీని వెన‌క మ‌త‌ల‌బు ఏమిటీ అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. అయితే ఇదే అంశంపై సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మ‌ధుయాష్కీ మాట్లాడారు. ఢిల్కీ లిక్క‌ర్ స్కామ్ కంటే తెలంగాణ‌లో జ‌రిగింది మ‌రింత పెద్ద స్కామ్ అంటూ ఆరోప‌ణ‌లు చేశారు. స‌హ‌జంగా ఇత‌రుకు ఛాన్స్ ఇవ్వకుండా విమ‌ర్శ‌లు గుప్పించే రేవంత్ రెడ్డి స్వ‌యంగా సీఎం కెసీఆర్ కుమార్తెపై ఆరోప‌ణ‌లు వ‌చ్చినా మౌనం దాల్చ‌టం ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది.

Next Story
Share it