Telugu Gateway
Telangana

బిజెపి నిరంకుశ తీరుకు వ్య‌తిరేకంగానే...కెటీఆర్

బిజెపి నిరంకుశ తీరుకు వ్య‌తిరేకంగానే...కెటీఆర్
X

ఢిల్లీ వేదిక‌గా తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. బిజెపి ప్ర‌తిపాదించిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ద్రౌప‌ది ముర్ముపై త‌మ‌కు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి వ్య‌తిరేక‌త లేద‌న్నారు. బిజెపి నిరంకుశ విధానాలు వ్య‌తిరేకిస్తూ ఆమె అభ్య‌ర్ధిత్వాన్ని తిర‌స్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిప‌క్ష పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా కెటీఆర్ హాజ‌రు అయ్యారు. అనంత‌రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 'యశ్వంత్‌ సిన్హాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ఆయనను హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించాము. ఎన్నికల్లో యశ్వంత్‌ సిన్హా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.దేశంలో అమలవుతున్నది అంబేద్కర్‌ రాజ్యాంగం కాదు.. బీజేపీ రాజ్యాంగం. దేశంలో మోదీ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోంది. మోదీ అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రయత్నిస్తోంది. గిరిజనులపై నిజంగా బీజేపీకి అభిమానం ఉంటే తెలంగాణలో రిజర్వేషన్లను పెంచాలి. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. మెజార్టీ లేకపోయినా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంబద్ధమైన వ్యవస్థలను చేతిలో పెట్టుకుని బెదిరిస్తున్నారు.

గట్టిగా ఎవరైనా మాట్లాడితే వెంటాడి మరీ వేధిస్తున్నారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులు చేయిస్తోంది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. కేంద్రంపై కచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా. ప్రశ్నించే వారిని ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా మోదీ ఏం ఇచ్చారు?. దేశంలోని దళితుల కోసం కేంద్రం ఏం చేసింది?. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో.. శ్వేతపత్రం విడుదల చేయాలి.ప్రతీ దానికి సమయం వస్తుంది. నరేంద్ర మోదీది దద్దమ్మ గవర‍్నమెంట్‌. మోదీ నియంతృత్వ పోకడలపై నోరు విప్పాలి. వారిలో విషం తప్ప విషయం లేదు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే సిన్హా మద్దతు కోరుతూ మిగిలిన ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతామని కేటీఆర్‌ తెలిపారు.

Next Story
Share it