Telugu Gateway
Telangana

మీ ప్యాకేజీలు మార్చండి..కెటీఆర్ లేఖ‌

మీ ప్యాకేజీలు  మార్చండి..కెటీఆర్ లేఖ‌
X

క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను ఆదుకునేందుకు కేంద్రం ప్ర‌క‌టించిన ప‌లు ప్యాకేజీలు ఆశించిన స్థాయిలో ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేద‌ని తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటీఆర్ తెలిపారు. ఆయ‌న ఈ మేర‌కు గురువారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు లేఖ రాశారు. క‌రోనా మూడ‌వ ద‌శ కూడా ఉంటుంద‌నే ఆందోళ‌న‌ వ్య‌క్తం అవుతున్న త‌రుణంలో వివిధ పారిశ్రామిక‌వ‌ర్గాల‌ను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీల్లో మార్పులు చేయాల‌ని కోరారు. లేఖ‌లోని ముఖ్యాంశాలు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికీ ఒక సంవత్సరం పైగా కావస్తున్నది. తెలంగాణ రాష్ట్ర తయారీ రంగానికి వెన్నుముకగా నిలుస్తున్న సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా గట్టి ప్రయత్నం చేస్తూ వచ్చాను. అయితే కరోనా సంక్షోభం ద్వారా తీవ్రంగా ప్రభావితమైన ఇక్కడి సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలకు మీరు ప్రకటించిన ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు అత్యంత కనిష్టంగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న 80 శాతానికిపైగా ఎంఎస్ఎంఈలు లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, 25 శాటానికి పైగా ఎంఎస్ఎంఈలు తమ రాబడులను పూర్తిగా కోల్పోవడం జరిగింది.

మీరు ప్రకటించిన ప్యాకేజీలో ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించిన గ్యారంటేడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఈ పథకం మార్గదర్శకాలు వెలువడిన తర్వాత.. ఈ పథకంలో ప్రత్యేక ఆకర్షణ ఏమీ లేదని తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు భావిస్తున్నాయి. పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను రూపొందించడం జరిగింది. దీనితో ఎంఎస్ఎంఈలు అనేక వ్యవప్రయాసలకు గురవుతున్నాయి. మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ సహాయ ప్యాకేజీలో రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఈల కోసం మరో రెండు పథకాలను ప్రకటించారు. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలోనే కాకుండా, దేశంలో ఎక్కడా కూడా ఈ రెండు పథకాలు ప్రారంభమైన పరిస్థితి కనిపించడం లేదు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన సబార్డినెట్ డెట్ స్కీం అత్యంత తక్కువ రుణ మొత్తాన్ని అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల వయబిలిటీ పైన స్పష్టత లేదు. ఇలాంటి సందర్భంలో మీరిచ్చే అత్యంత తక్కువ రుణ మొత్తం ఆయా ఎంఎస్ఎంఈల అవసరాలకి ఏమాత్రం సరిపోవడం లేదు.

దీంతో పాటు ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన కార్పస్ ఫండ్ స్కీమ్ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాలేదు. ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా కీలక రంగాలకు ప్రకటించిన పిఎల్ఐ పథకం ద్వారా దేశంలోని ఎంఎస్ఎంఈల పై పెద్దఎత్తున సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత పథకం కేవలం పెద్ద తయారీ కంపెనీలకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేలా ఉంది. దేశీయ ఎంఎస్ఎంఈలతో కూడిన ఒక సప్లై చైన్ ఏర్పాటు చేయాలని భారీ తయారీ కంపెనీలకు ఒక నిబంధన రూపొందించడం ద్వారా పిఎల్ఐ ప్రయోజనాలను ఆయా ఎంఎస్ఎంఈలతో పంచుకునేలా ఈ కార్యక్రమం మార్గదర్శకాలను మార్చవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజీని మరోసారి పునర్ నిర్వచించడం ద్వారా ఈ కరోనా సంక్షోభం ద్వారా ప్రభావితమైన వివిధ రంగాలు, ముఖ్యంగా అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంఎస్ఎంఈ రంగానికి మరింత చేయూతనిచ్చే అవకాశం కలుగుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వము సరైన చర్యలు తీసుకుంటుందని, కేంద్రం చేసే ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్యాకేజీ విషయంలో మా ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను అని పేర్కొన్నారు.

Next Story
Share it