Telugu Gateway
Telangana

కెసిఆర్ ను కెటిఆర్ ఇరకాటంలోకి నెట్టారా?!

కెసిఆర్ ను కెటిఆర్ ఇరకాటంలోకి నెట్టారా?!
X

తెలంగాణ అసెంబ్లీ వేదికగా శనివారం నాడు చోటు చేసుకున్న పరిణామాలు బిఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సహజంగా సభానాయకుడు, ముఖ్యమంత్రి రిప్లై ఇస్తారు. కానీ ఈ సారి ఆ బాధ్యతను కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ తీసుకున్నారు. కానీ ఎంఐఎం శాసనసభ పక్షా నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కెటిఆర్ ల మధ్య జరిగిన వాదోపవాదాల తర్వాత చోటుచేసుకున్న పరిణామం ఎటు దారితీస్తుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ లో అధికార బిఆర్ఎస్, ఎంఐఎంలు మిత్రపక్షాలుగా ఉంటూ వస్తున్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం కు ఇంత సమయమా...105 మంది ఎంఎల్ఏలు ఉన్న మాకు ఎంత సమయం ఇవ్వాలంటూ మంత్రి కెటిఆర్ స్పీకర్ ను ప్రశ్నించారు. ఈ సమయంలోనే అక్బరుద్దీన్ ఈ వ్యవహారంపై స్పందించారు. కెటిఆర్ మాట్లాడితే తమకు ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని అంటున్నారని...అయన మాటలను తాను చాలా సీరియస్ గా తీసుకున్నానని..మా పార్టీ అధ్యక్షుడి ఆమోదంతో వచ్చే ఎన్నికల్లో 50 సీట్ల లో పోటీ చేసి కనీసం ఈ సారి 15 కు తక్కువ కాకుండా సీట్లు గెలుచుకుని వస్తామంటూ వ్యాఖ్యానించారు.

ఎప్పటినుంచో ఎంఐఎం పోటీచేసిన చోట్ల తప్ప మైనారిటీలు అధికార బిఆర్ఎస్ వైపు పూర్తిగా మొగ్గుతున్నారు అనే అంచనాలు ఉన్నాయి. నిజంగా అక్బరుద్దీన్ చెప్పినట్లు ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో నిజంగా 50 సీట్లలో పోటీ చేస్తే మాత్రం అది ఖచ్చితం గా అధికార బిఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని చెపుతున్నారు. ఎన్నికలనాటికి ఇది వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అన్నది వేచిచూడాలి. తాము 15 సీట్లు గెలిచినా ..ఇలాగే బిఆర్ఎస్ తో కలిసి పని చేస్తాం అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. నిజంగా అదే జరిగితే ఈ మేరకు తగ్గే బలం సహజంగా అధికార పార్టీ దే ఉంటుంది. కెటిఆర్ తన వ్యాఖ్యలతో సీఎం కెసిఆర్ ను ఇరకాటంలోకి నెట్టినట్లు అయింది అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పై పలు వర్గాల్లో వ్యతికరేకత ఉందనే లెక్కలు ఉన్నాయి. ఈ తరుణంలో అక్బరుద్దీన్ ప్రకటన నిజం అయితే మాత్రం బిఆర్ ఎస్ కు కష్టాలే అని చెపుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Next Story
Share it