Telugu Gateway
Telangana

ఐటిలో హైదరాబాద్ కు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలి

ఐటిలో హైదరాబాద్ కు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలి
X

కేంద్రంలోని బిజెపి సర్కారు ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఐటిఐఆర్) ప్రాజెక్టులను అటకెక్కించినందున తత్సమానమైన ప్రాజెక్టులను హైదరాబాద్ కు కేటాయించాలని తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. హైదరాబాద్ నగరం ఐటి రంగంలో దేశ సగటు కంటే చాలా ఎక్కువ ప్రగతి సాధిస్తున్నందున ప్రత్యేక ప్రోత్సాహకం కింద హైదరాబాద్ కు నూతన హోదాను అయినా కేటాయించాలన్నారు. 'గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌ నగరం ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని కొనసాగిస్తున్నది. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రగతి ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో ప్రశ్నార్థకమైనా.. తెలంగాణలో మాత్రం ఐటీ ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. జాతీయ సగటు 1.9శాతం ఉండగా.. తెలంగాణ గ్రోత్ రేట్ 7 శాతంతో 1.4 లక్షల కోట్లుగా ఉంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్ మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటో మొబైల్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెక్నాలజీస్, బ్లాక్చైన్ వంటి నూతన ఎమర్జింగ్ టెక్నాలజీలను సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వస్తున్నది. దీంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌, నైపుణ్య శిక్షణ వంటి రంగాల్లో కూడా ప్రభుత్వం వినూత్న పాలసీల ద్వారా అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనంత గొప్ప ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న టీ హబ్, టీ వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి అనేక సంస్థలు ఈ రంగంలో గత ఆరు సంవత్సరాల్లో నెలకొల్పబడ్డాయి'' అని పేర్కొన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కెసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీని కలసి వినతిపత్రాలు అందించారని..తాను స్వయంగా కూడా పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. ఐటి రంగంలో హైదరాబాద్ సాగిస్తున్న ప్రగతిని చూసి అయినా ప్రత్యేక హోదాతో ఈ రంగం మరింత ప్రగతి సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story
Share it