Telugu Gateway
Telangana

ఆదాయం..అప్పులు పెరిగినా..ఆగని భూముల అమ్మకం

ఆదాయం..అప్పులు పెరిగినా..ఆగని భూముల అమ్మకం
X

ఇంటి పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ పని చేయించి ఇంటి సంపద పెంచటానికి కృషి చేయాలి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పెద్ద గా..ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ చేస్తున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి..నా పని నేను చేసుకుంటా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తన వల్లే తెలంగాణ దేశంలో అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది అని చెప్పుకుంటూ ...తలసరి ఆదాయం అద్భుతంగా పెరిగింది అని ప్రకటిస్తూ ఇలా వరస పెట్టి భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకు వస్తోంది. ఒక వైపు పన్నుల ఆదాయం గణనీయంగా పెరుగుతున్నా...అదే సమయంలో అప్పులు కూడా గతంలో ఎవరూ చేయనంత చేస్తూ కూడా కూడా సీఎం కెసిఆర్ ఇంతలా భూములు ఎందుకు అమ్ముతున్నారు. భూములు అమ్ముకుంటూ ఖజానాకు డబ్బులు సమకూర్చుకుంటూ ఇది కూడా తెలంగాణ పరపతి కి దర్పణం అని చెప్పుకోవటం అంటే ఒక్క కెసిఆర్ కు మాత్రమే చెల్లింది అని చెప్పుకోవాలి. గత ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీల అమలులో పెద్దగా ఫోకస్ పెట్టని కెసిఆర్ కేవలం తనకు రాజకీయంగా కలిసి వచ్చే..తనకు రాజకీయంగా ఉపయోగపడే వాటిపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. స్కీం ల అమలులో లోని దూకుడు భూముల అమ్మకంలో సీఎం కెసిఆర్ చూపిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న కోకాపేట భూముల వేలం అలా అయిపోయిందో లేదో శుక్రవారం నాడు బుద్వేల్ లో వంద ఎకరాల భూమి అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చారు. కోకాపేట భూముల వేలం ద్వారా సర్కారుకు అంచనాలకు మించి ఆదాయం వచ్చింది.

ప్రభుత్వ ఖజానాకు 3319 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. బుద్వేల్ వేలం ద్వారా కూడా ఇంతే మొత్తంలో వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. కోకాపేట లో ఎకరం వంద కోట్ల రూపాయలకు అమ్ముడు పోవటం ప్రభుత్వానికి మంచిదే అయినా ఈ ధరలు రాబోయే రోజుల్లో మధ్యతరగతి ప్రజలను కూడా సొంత ఇంటి కలకు దూరం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఒకెత్తు అయితే 111 జీఓ రద్దుతో ఒకే సారి ఆ ప్రాంతంలో లక్ష ఎకరాల భూమి పైగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో ధరలు తగ్గుతాయని భావిస్తే సర్కారు వేలంలో ఒక బిట్ లో ఎకరా వంద కోట్ల రూపాయలు పైగా పలకటం వెనక ఏదైనా గూడుపుఠాణి ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే కొంత మంది హెచ్ఎండీఏ అధికారులే 111 జీఓ రద్దు తర్వాత రేట్లు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. కానీ వేలంలో మాత్రం పరిస్థితి తెలిసిన అధికారుల అంచనాలకు బిన్నంగా ధరలు రావటంపై మున్సిపల్ అధికారులు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . దీంతో పాటు మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ఇలా వరసపెట్టి భూములు అమ్మటం అన్నది నైతికంగా ఎంత వరకు ఆమోదయోగ్యం అని ఒక ఐఏఎస్ విస్మయం వ్యక్తం చేశారు. అయితే కెసిఆర్ సర్కారు నైతికత వంటి అంశాలు పట్టించుకుంటుంది అని ఆశించటమే అత్యాశ అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ఆదాయం పెరిగినా...మరో వైపు విపరీతంగా అప్పులు చేస్తూ..భూములు అమ్ముతూ పాలనా సాగిస్తూ...మాదే సూపర్ మోడల్ అని చెప్పుకోవటం కెసిఆర్ , కెటిఆర్ లకే చెల్లింది.

Next Story
Share it