ఉద్యమంలా భూములు అమ్ముతున్న కెసిఆర్ సర్కారు

ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వ భూముల వేలంపాట ఆపాలి...ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకోవాలి అంటూ ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కెటిఆర్ ప్లకార్డు పట్టుకుని మరీ ధర్నాలో కూర్చున్నారు. వెనక ఉన్న ఈ ఫోటో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో కెసిఆర్ సర్కారు ప్రభుత్వ భూములను వేలం వేస్తోంది...అసలు సిసలైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు సాగుతోంది. కోకాపేటలో ఇప్పటికే రెండు విడతల అమ్మకాలు పూర్తి చేసింది. తాజాగా బుద్వేల్ వంతు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా మరిన్ని భూముల విక్రయాలు ఉండేలా ఉన్నాయని చెపుతున్నారు. అందుకే ఎక్కువ గ్యాప్ లేకుండా నోటిఫికెషన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదు అని డిమాండ్ చేసిన కేటీఆర్ ఇప్పుడు ఎకరం వంద కోట్ల రూపాయల ధర పలికింది అని గొప్పగా చెప్పుకోవటమే కాకుండా..భూముల అమ్మకాన్ని కూడా ఒక ఘనతగా ప్రకటించుకుంటున్నారు. వెరైటీ అంటే ఇదేనేమో.