Telugu Gateway
Andhra Pradesh

అభ్యర్థులను మార్చితే అంతా మారిపోతుందా?

అభ్యర్థులను మార్చితే అంతా మారిపోతుందా?
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయ ప్రయోగం ఫలిస్తుందా?. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేస్తే ప్రజలు అన్నీ మర్చిపోతారా?.వచ్చే ఎన్నికల కోసం జగన్ చేస్తున్న మార్పులు మంచి చేస్తాయా..లేక నిండా ముంచుతాయా అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది. గత కొన్ని రోజులుగా జగన్ వచ్చే ఎన్నికల కోసం కసరత్తును వేగవంతం చేశారు. గత నాలుగున్న సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఏమి చేసినా మాట్లాడకుండా ఉండి..ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొత్త వాళ్ళను బరిలో నిలిపితే అదే పార్టీ తరపున ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యే చేసిన పనులను మర్చి పోయి వైసీపీ కి ఓటు వేయటం సాధ్యం అవుతుందా అన్న చర్చ కూడా ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. అటు జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ మంత్రులు, నేతలు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా తమకు ఏమీ కాదు అని పైకి ఎన్ని మాటలు చెపుతున్నా కూడా ఆ పార్టీని ఇప్పుడు కలవరానికి గురిచేస్తున్న ప్రధాన అంశం టీడీపీ, జనసేనల పొత్తే అనే విషయం ఆ పార్టీ నేతలకు తెలుసు. ఈ పొత్తు వల్ల ఆ రెండు పార్టీలకు కలిగే ప్రయోజనాన్ని ఎంత వీలు అయితే అంత తగ్గించేందుకు వైసీపీ నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సిందే. టికెట్ రాని వాళ్ళు బాధ పడాల్సిన అవసరం లేదు అని...టికెట్ ఇవ్వనంత మాత్రాన వాళ్ళు తన వాళ్ళు కాకుండా పోరు అంటూ జగన్ ఉపశమన మాటలు చెపుతున్నారు.

అయితే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో సీఎం జగన్ తో ముఖాముఖి భేటీ అయిందే లేదు..అలాంటిది టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాక కూడా ఇంకా జగన్ తమను పట్టించుకుంటారు అంటే ఎవరైనా నమ్ముతారా అని ఒక సీనియర్ నేత సందేహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందాం అనుకున్న వాళ్ళు తప్ప...జగన్ టికెట్ నిరాకరిస్తే ఆయా నేతలు వైసీపీ అభ్యర్థుల గెలుపుకు సహకరించటం జరిగే పని కాదు అని చెపుతున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థులను అటు ఇటు మార్పులు చేస్తున్నారు. వీళ్లకు కొత్త నియోజకవర్గాల్లో ఉన్న నేతలు ఎంత మేర సహకారం అందిస్తారు అన్న అంశంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల మార్పుకు సంబదించిన విషయాలు ఇలా ఉంటే గత నాలుగున్నర సంవత్సరాల పాలనా కాలంలోనే జగన్ వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇందులో ప్రధానమైనది ఉద్యోగల అంశం. ప్రతిపక్షంలో ఉండగా వాళ్లపై ఎక్కడ లేని ప్రేమ కురిపించిన జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం వాళ్లకు చుక్కలు చూపించారు అనే చెప్పాలి. అదనపు సాయాల సంగతి పక్కన పెట్టి జీతాలు కూడా సకాలంలో ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో పాటు రాజధాని అంశంలో నెల కొన్న గందరగోళం, రాష్ట్రంలో అద్వాన్న రోడ్లు, పోలవరం పడకేయటం, కేంద్రం నుంచి విభజన హామీలు సాదించుకోలేకపోవటం, ఇసుక వివాదాలు, దారుణమైన మద్యం విధానం వంటి విషయాలు ఎన్నో. మరి ఇన్ని సమస్యలను అధిగమించి జగన్ మార్పులు చేసి ప్రజలను మరో సారి తన వైపు తిప్పుకోగలరా అన్నది చూడాల్సిందే.

Next Story
Share it