Telugu Gateway
Telangana

కెసిఆర్, కెటిఆర్ చెప్పేది ఒకటి...చేసేది మరొకటి!

కెసిఆర్, కెటిఆర్ చెప్పేది ఒకటి...చేసేది మరొకటి!
X

తెలంగాణ సర్కారు తీరు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు తాము తమ అద్భుత పరిపాలన ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అయితే వేల అడుగులు ముందుకు వేసి ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అయిన వ్యయం 80 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే రికవరీ కూడా అయినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడితే సంపద సృష్టి గురించే ప్రస్తావిస్తున్నారు. కాసేపు వీళ్ళు చెపుతున్నదే నిజం అనుకుందాం. కాళేశ్వరం కట్టిన నాలుగేళ్లలోనే ఎనభైవేల కోట్ల రూపాయల రికవరీ సాధించి అద్భుతాలు సృష్టిస్తే..మరి ఇప్పుడు హైదరాబాద్ వంటి కీలక నగరంలో తెలంగాణ సర్కారు ఆస్తులు వరసపెట్టి ఎందుకు తెగనమ్ముతోంది అనే ప్రశ్న ఉదయించకమానదు. నిజంగా సంపద సృష్టించే సామర్థ్యం, శక్తి ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు పెంచుతారు కానీ అమ్మరు. ఒక వైపు గత ప్రభుత్వాలకు బిన్నంగా పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ కూడా మరి ఇప్పుడు ఇంతగా భూములు అమ్మాల్సి అవసరం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. తాజాగా తెలంగాణ సర్కారు బుద్వేల్ లో వంద ఎకరాలు అమ్మి 3625 కోట్ల రూపాయలు సమీకరించింది. కొద్ది రోజుల క్రితమే కోకాపేట లో రెండవ విడత 45 ఎకరాలు అమ్మి 3300 కోట్లు సేకరించింది.

ఇందులో ఒక బిట్ ఎకరం వంద కోట్ల రూపాయలపైనా ధర పలికిన విషయం తెలిసిందే. గతంలో ఒక సారి వేలం వేసి ఇదే కోకాపేట భూముల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు సమీకరించారు. ఈ డబ్బులను దళిత బందుకు ఉపయోగిస్తామని ప్రభుత్వం అప్పటిలో ఘనంగా ప్రకటించుకుంది కూడా. కొద్ది రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్ )ను దీర్ఘకాలిక ప్రాతిపదికన లీజుకు ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ఖజానాకు 7380 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఓఆర్ఆర్ డబ్బులతో పాటు తాజాగా కోకాపేట, బుద్వేల్, మోకిలా భూముల వేలం ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం కలిపితే 14426 కోట్ల రూపాయలు అవుతున్నాయి. రాబోయే రోజుల్లోనే మరిన్ని భూముల వేలాలు కొనసాగే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఒక వైపు తాము ప్రవేటీకరణకు వ్యతిరేకం అంటూ ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెట్టే ఓఆర్ఆర్ ను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. తాము ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకం..ప్రధాని మోడీ అన్ని అమ్మేస్తున్నారు అని విమర్శించి ఎన్నికల ముందు ఎడా పెడా ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అనే విమర్శలు బిఆర్ఎస్ సర్కారు ఎదుర్కొంటోంది.

Next Story
Share it