Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో హ్యుండ‌య్ 1400 కోట్ల పెట్టుబ‌డులు

తెలంగాణ‌లో హ్యుండ‌య్ 1400 కోట్ల పెట్టుబ‌డులు
X

దావోస్ లోని ప్ర‌పంచ ఆర్ధిక ఫోరం (డ‌బ్ల్యూఈఎఫ్‌) స‌మావేశాల్లో తెలంగాణ భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకుంటోంది. తాజాగా రాష్ట్రానికి మ‌రో 1400 కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని ప‌రిశ్ర‌మ‌ల‌, ఐటి శాఖ‌ల మంత్రి కెటీఆర్ వెల్ల‌డించారు. కంపెనీ ప్ర‌తినిధులు మంత్రి కెటీఆర్ తో స‌మావేశం అయిన త‌ర్వాత ఈ ప్ర‌క‌ట‌న చేశారు. దావోస్ లోని తెలంగాణ పెవీలియన్ లో హ్యుండ‌య్ సిఐఓ యంగ్‌చో చి (CIO Mr. YoungCho Chi) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్ లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్ లతో పాటు ఎకో సిస్టమ్ కు అవసరం అయిన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాల పైన కూడా విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుండ‌య్ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుండ‌య్ కి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో 1400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హ్యుండయ్ కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హ్యుండాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Next Story
Share it