ఒమిక్రాన్ పరీక్షల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు

కరోనాకు ముందు నాటి పరిస్థితులు వచ్చాయని అందరూ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ తెరపైకి వచ్చింది. ఇది అంత ప్రమాదకారి కాకపోయినా వేగంగా విస్తరించే లక్షణాలు ఉన్నాయని గుర్తించటంతో ప్రపంచం అంతా అప్రమత్తం అయింది. ముఖ్యంగా విమానాశ్రయాల్లో ఏర్పాట్లను మరింత పకడ్భందీ చేశారు. ముఖ్యంగా హై రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా పరీక్షలు చేస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కొత్త స్ట్రెయిన్ ఓమిక్రాన్ ద్వారా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడంతో భారత ప్రభుత్వం ఇటీవల నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకుల సౌకర్యాల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాణీకులకు సురక్షితంగా ఉండేలా/ప్రయాణించగలిగేలా ఇంటర్నేషనల్ అరైవల్ హాల్ ప్రీ-ఇమ్మిగ్రేషన్లో ప్రత్యేక కోవిడ్-19 టెస్టింగ్ బూత్లను ఏర్పాటు చేసారు. అన్ని అరైవల్ గేట్ల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ప్రయాణీకుల సౌలభ్యం కోసం టెర్మినల్ అంతటా స్టిక్కర్లు, పోస్టర్ల ద్వారా ఆర్ టీపీసీఆర్ / రాపిడ్ పీసీఆర్ ఏర్పాట్ల గురించి తెలియజేస్తున్నారు. ప్రయాణీకులకు మార్గనిర్దేశం కోసం పలు ప్రదేశాలలో సైనేజ్లు కూడా ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల కోసం హైదరాబాద్ విమానాశ్రయం ముందస్తు RT-PCR / రాపిడ్ PCR పరీక్షల బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ప్రయాణీకులు రాకకు ముందే తమ పరీక్షను బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్సైట్ www.hyderabad.aero లింకును లేదా పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబ్ వెబ్సైట్ http://covid.mapmygenome.in లింకును బుకింగ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. RT - PCR పరీక్ష ఫలితం కోసం రూ. 750 (నిరీక్షణ సమయం 6 గంటలు), ర్యాపిడ్ PCR పరీక్ష ధర రూ. 3,900 (2 గంటల నిరీక్షణ సమయం). GHIAL సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కూడా ఈ సమాచారాన్ని పొందుపరిచారు. RT-PCR/Rapid PCR పరీక్షను ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణీకుల కోసం GHIAL ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇలాంటి ప్రయాణికుల కోసం ప్రత్యేక క్యూలు ఉంటాయి. ఇలాంటి వారికి రిజిస్ట్రేషన్ సమయం ఆదా అయి వారు నేరుగా పరీక్షకు వెళ్లొచ్చు. పరీక్ష ఫలితం కోసం వేచి ఉండే సమయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం తగిన సీటింగ్ ఏర్పాట్లు, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఫారెక్స్ ఎక్స్ఛేంజ్, పేమెంట్ కౌంటర్ల సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వెయిటింగ్ ఏరియా ఏర్పాటు చేశారు.



