రాజ్ భవన్ కు కాషాయ రంగు ఎందుకు వేస్తున్నారు?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించాలని నిర్ణయించటంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై బిజెపి మండిపడుతుంటే..అధికార టీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఈ అంశంపై మంగళవారం నాడు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావులు స్పందించారు. గవర్నర్ అంశంపై బిజెపి నేతలు అవగాహన రహిత్యంతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని హరీష్ మండిపడ్డారు. బీజేపీ నేతల వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, గవర్నర్ మహిళ కాబట్టే అవమానిస్తున్నారని బీజేపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ మాతృమూర్తుల పై చేసిన వాఖ్యలను సమర్దించిన బండి సంజయ్ కి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ని గవర్నర్ ను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెడుతుంది బీజేపీ కాదా అన్నారు. గవర్నర్ ను అవమానించే ఉద్దేశ్యం తమకు లేదన్నారు.. మహిళ పేరు తో బీజేపీ రాజకీయం చేస్తోంది. రాజ్ భవన్ కు కాషాయ రంగు ఎందుకు వేస్తున్నారన్నారు. రాజ్ భవన్ కు బీజేపీ కి ఏమి సంబంధం అన్నారు.
ఏదైనా ఉంటే గవర్నర్ కు ప్రభుత్వం వివరణ ఇస్తుందని తెలిపారు. ప్రోరోగ్ కానీ అసెంబ్లీ కొత్త సెషన్ కాదని, బీజేపీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ వ్యవహారాల పై బీజేపీ నేతలకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. నిబంధనలు తెలుసుకోకుండా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. తాము చేసిన అభివృద్ధి ని గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పాలని అనుకుంటాం..ఆ అవకాశాన్ని మేము పోగోట్టుకోమన్నారు. సాంకేతిక సమస్య వల్ల ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదని తెలిపారు. సమావేశాలు ప్రోరోగ్ కాకపోతే గవర్నర్ ప్రసంగం ఉండదని తెలిపారు. 2004 డిసెంబర్ లో పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్ జరిగిందని, ప్రోరోగ్ సమావేశాలకు గవర్నర్ ను పిలిస్తే తప్పు.. అది రాజ్యంగం ను అతిక్రమించినట్లు అవుతుందని తెలిపారు. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంబించాలని రాజ్యాంగంల లో ఎక్కడా లేదని తెలిపారు.