కిషన్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ అమరవీరుల పేరు ఎత్తే అర్హత కిషన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల వాడుక భాషనే సీఎం కేసీఆర్ మాట్లాడతారన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే భాష బీజేపీదని, కేసీఆర్ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొల్లు పురాణం వద్దని, చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ చేయాలని హరీశ్ రావు సూచించారు. ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ పెంచాలని, అది జరగాలంటే రాజ్యాంగం మార్చాలనడం తప్పా అని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టు, ఐఐఎం, ఐఐటీ ఇవ్వమని కిషన్ రెడ్డి ఎందుకు అడగడం లేదని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం దగ్గరికి సీఎం కేసీఆర్ ను కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి చర్చకు రమ్మని సవాల్ విసురుతున్నారు..అసలు అమరవీరుల స్థూపాన్ని తాకే హక్కు కిషన్ రెడ్డి కి ఉందా అని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. 2010 లో తన సహచర ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ రాజీనామా చేసినా కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని, యెండల లక్ష్మీనారాయణ ను గెలిపించుకోవడం కిషన్ రెడ్డి కి చేతకాక పోతే కెసీఆర్ తెలంగాణ ఇజ్జత్ కోసం గెలిపించుకున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి స్థాయి సీఎం కేసీఆర్ స్థాయి కాదని, కిషన్ రెడ్డి తో చర్చకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలన్నారు. కిషన్ రెడ్డికి తెలంగాణ కోటాలో మంత్రి పదవి వచ్చింది అంటే కూడా అది కెసీఆర్ చలవేనన్నారు. అభి వృద్ధి గురించి మాట్లాడమంటే పాకిస్తాన్ పాచిక వేస్తారని, కిస్తాన్ పాచిక కూడా పని చేయడం లేదు. పాచి పోయిందన్నారు.