కరోనా బాధిత రాష్ట్రాలకు గ్రీన్ కో ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు

మొత్తం వెయ్యి కాన్సన్ ట్రేటర్లు..తెలంగాణకు తొలి దశలో 200
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఆదివారం నాడు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి కేటీఆర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు. గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించినందుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని, అయితే ఇప్పుడు అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సెంట్రేటర్ల లను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్ధల్లో ఒకటిగా వెలుగొందుతున్న గ్రీన్కో గ్రూప్ ,అంతర్జాతీయ సరఫరా చైన్ నెట్వర్క్ ను వినియోగించుకుని అత్యంత క్లిష్టమైన ఆక్సిజన్ మద్దతు వ్యవస్థలను భారతదేశానికి తీసుకువచ్చింది. గ్రీన్కో కో–ఫౌండర్లు అనిల్ చలమలశెట్టి , మహేష్ కొల్లి సైతం ఈ కార్గో విమానాల తొలి రాకను స్వాగతిస్తూ విమానాశ్రయంలో హాజరయ్యారు.
విమానాశ్రయంలో పాత్రికేయులతో ముచ్చటించిన గ్రీన్కో గ్రూప్ ఎండీ అండ్ సీఈవో అనిల్ చలమలశెట్టి తమ గ్రీన్కో గ్రూప్ ప్రణాళికలను వెల్లడిస్తూ ''గత రెండు వారాలలో తాము ఏర్పాటుచేసిన శక్తివంతమైన అంతర్జాతీయ నెట్వర్క్ద్వారా తాము ఏర్పాటుచేసిన ఐదు కార్గో విమానాలలో తొలి బ్యాచ్ను తాము అందుకున్నాం. రాబోయే ఐదు రోజులలో, మరో నాలుగు ఎయిర్క్రాఫ్ట్ లు హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీలలో 1000 భారీ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో రానున్నాయి. ఇది టియర్ 2, టియర్ 3 నగరాలలోని వైద్య సిబ్బందికి ఐసీయు ముందుస్తు మద్దతనందించడంతో పాటుగా రోగుల ఐసీయు స్టెబిలైజేషన్ తరువాత కూడా తోడ్పడనున్నాయి. దానితో పాటుగా మన ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు, మద్దతు వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్న కొవిడ్ సెకండ్ వేవ్తో పోరాడేందుకు సైతం తోడ్పడనున్నాయి. దేశానికి తోడ్పాటునందించేందుకు మా కార్యకలాపాలను కొనసాగించనున్నామని తెలిపారు.