Telugu Gateway
Telangana

కొన‌సాగుతున్న గ‌వ‌ర్న‌ర్ ఎటాక్

కొన‌సాగుతున్న గ‌వ‌ర్న‌ర్ ఎటాక్
X

తెలంగాణ స‌ర్కారుపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. బుధ‌వారం నాడు ప్ర‌ధాని మోడీతో స‌మావేశం అయిన ఆమె..గురువారం నాడు హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు నివేదిక‌లు ఆయ‌న‌కు అంద‌జేసినట్లు స‌మాచారం. అమిత్ షాతో భేటీ అనంత‌రం కూడా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యవహారాలపై ప్రదాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ కేసు, అవినీతిపై మోదీ, అమిత్‌షాలకు నివేదిక ఇచ్చానని తెలిపారు. డ్రగ్స్‌తో యువత నాశనం అవుతున్నారని, ఓ తల్లిగా బాధపడుతూ మోదీకి నివేదిక ఇచ్చానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ని ఒక అన్నగా భావించానని తెలిపారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు.

తన తల్లి రాజ్ భవన్‌లో చనిపోయినప్పుడు సీఎం కేసీఆర్‌ చూడడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్లతో విభేదించిన ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, మమత ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచే వారని గుర్తుచేశారు. తెలంగాణలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. యూనివర్సిటీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని తమిళిసై తప్పుబట్టారు. ''ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం... గవర్నర్‌గా నాకుంది. నేను ఆపని చేయను. తెలంగాణ ప్రభుత్వంపై నాకు ఎలాంటి కోపం లేదు'' అని తమిళిసై ప్రకటించారు.

Next Story
Share it