Telugu Gateway
Telangana

టీడీపీ నిర్ణయంతో ఎవరికి మేలు!

టీడీపీ నిర్ణయంతో ఎవరికి మేలు!
X

మాములుగా అయితే ఒక రాజకీయ పార్టీ..అది ఏదైనా ఎన్నికల బరిలో నిలవక పోవటం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు. తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ ఇప్పుడు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా మారిపోయింది. బీజేపీ రేస్ లో ఉన్నా ప్రధాన పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ ల మద్యే. దీంతో తెలంగాణాలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీ పోటీ కి దూరంగా ఉండటం ఎవరికీ లాభం...ఎవరి నష్టం అన్న చర్చ తెర పైకి వచ్చింది. టీడీపీ ఎన్నికల బరిలో ఉన్నా ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే అంశం కంటే ఎవరి అవకాశాలు దెబ్బతీస్తుంది అంటే అందరూ కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం అని తేల్చారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార బిఆర్ఎస్ కు మేలు జరుగుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు మేలు చేయనుంది. మరో వైపు ప్రస్తుత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగు దేశంలో ఉండటంతో చాలా మంది టీడీపీ క్యాడర్ ఇప్పటికే ఈ సారి రేవంత్ కు మద్దతుగా కాంగ్రెస్ కు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా కూడా చెపుతూ వస్తున్నారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించటంతో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కు ఉపయోగపడే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే 95 మంది అభ్యర్థులతో తాము పోటీ కి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా రాజమండ్రి జైలు లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తో సమావేశం అయిన సమయంలో జ్ఞానేశ్వర్ కు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకుందాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం జ్ఞానేశ్వర్ తో పాటు తెలంగాణ టీడీపీ నేతలను నిరాశపర్చింది. గత ఏడాది చివరిలో ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి తెలంగాణ టీడీపీ కి తిరిగి పూర్వవైభవం తెస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఆ సభ మంచి విజయవంతం కూడా అయింది. అప్పటి నుంచి అదే ఊపులో పార్టీ ని నడిపించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది ..కారణాలు ఏమైనా ఖమ్మం మీటింగ్ తర్వాత చంద్రబాబు కూడా తెలంగాణ పార్టీ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది అన్న తరహాలో తప్ప తెలంగాణ టీడీపీ పై ప్రత్యేక ఫోకస్ పెట్ట లేదు. పార్టీ యాక్టీవ్ గా లేకపోయినా పలు నియోజకవర్గాల్లో టీడీపీ కి ఓటు బ్యాంకు ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణాలో అధికార బిఆర్ఎస్ కు మేలు చేసేలా రాష్ట్రంలో ఉన్న119 నియోజకవర్గాల్లో టీడీపీ ని పోటీ చేయించి అందుకు అవసరం అయిన ఆర్థిక సాయం చేయటానికి కూడా ఒక ప్రధాన పార్టీ సిద్ధం కాగా...చంద్రబాబు అరెస్ట్ అనంతరం మారిన పరిస్థితుల్లో టీడీపీ కూడా దీనికి నో చెప్పినట్లు ఒక కీలక నేత వెల్లడించారు. ఆ పార్టీ చెప్పినట్లు ఆడితే వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో మరింత నష్టం జరుగుతుంది అనే కారణంతోనే ఈ ప్రతిపాదనను తోసిపుచ్చినట్లు అయన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే టీడీపీ నిర్ణయం తెలంగాణాలో కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు. అయితే రాష్ట్రంలోని టీడీపీ క్యాడర్ ఎవరికీ ఓటు వేయాలనే విషయంపై ఆ పార్టీ ఎలాంటి ప్రకటన చేసే ఛాన్సులు లేవు అని చెప్పొచ్చు.

Next Story
Share it