Telugu Gateway
Telangana

కరోనా కట్టడిలో ఢిల్లీ..మహారాష్ట్ర మోడల్స్ చూడండి

కరోనా కట్టడిలో ఢిల్లీ..మహారాష్ట్ర మోడల్స్ చూడండి
X

వైరస్ కట్టడికి ద్విముఖ వ్యూహం..అధికారులకు సీఎం కెసీఆర్ ఆదేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్రంలో కరోనా కట్టడికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీ ప్రభుత్వం సమర్థవంతంగా కరోనాను కట్టడి చేస్తున్నదని తెలుస్తున్నది. మహారాష్ట్ర కూడా కరోనాను కట్టడి చేయడంలో సత్ఫలితాలను సాధిస్తున్నది. ఇంకా ఏ ఏ రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నవి. అందుకు వారు అమలు పరుస్తున్న కార్యాచరణ ఏంటో తెలుసుకోండి" అని వైద్యాధికారులను సీఎం కెసీఆర్ ఆదేశించారు. అవసరమైతే వైద్య బృందం ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించి రావాలన్నారు. ''తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాన్ని శాతం 5 శాతానికి తగ్గించగలిగినప్పుడే మనం కరోనా మీద విజయం సాధించినవారమౌతాం. ఆ దిశగా వైద్యాధికారులు చర్యలను చేపట్టాల''ని సూచించారు. కెసీఆర్ సోమవారం నాడు ప్రగతిభవన్ లో కరోనా అంశంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని, దాన్ని కొనసాగిస్తూనే, ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షలకోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ నిరాకరించకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా పరీక్షలకు సంబంధించి రాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్సకోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సిఎం సూచించారు. కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తక్షణమే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సిఎం ఆదేశించారు. ఉత్పత్తిదారులతో మాట్లాడి, పీహెచ్ సీలకు, అన్ని పరీక్షా కేంద్రాలకు కిట్ల సరఫరాను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. అదే సమయంలో వైద్య కేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు, వైద్యాధికారులకు ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సిఎం సృష్టం చేశారు.

లాక్ డౌన్ నేపధ్యంలో కొన్ని శాఖల ఖర్చు పెరుగుతుందని, కొన్ని శాఖల ఖర్చు తగ్గుతుందని సిఎం అన్నారు. ఖర్చు తగ్గే అవకాశాలున్న శాఖలను గుర్తించి ఖర్చు పెరిగే అవకాశాలున్న పోలీస్, వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్ ను పెంచాలని, ఈ విషయం మీద సమీక్ష నిర్వహించాలని మంత్రి హరీష్ రావును సీఎం ఆదేశించారు. అన్ని పడకలను ఆక్సీజన్ పడకలుగా మార్చాలని రాష్ట్రంలో ఆక్సీజన్ ఉత్పత్తిని 600 ఎం టీలకు పెంచే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. అదే సందర్భంలో...సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వాల్లు అధికి సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాస్క్ ఫోర్సు చైర్మన్ మంత్రి కెటిఆర్ ను సిఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ ఒకవేళ వస్తే ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలన్నారు. "మనం ఇప్పటికే కరోనా శాతాన్ని తగ్గించడంలో సత్ఫలితాలను సాధిస్తున్నాం. బ్లాక్ ఫంగస్ విస్తరిస్తున్నదని, హైదరాబాద్ లో బ్లాక్ ఫంగస్ వ్యాధి గ్రస్థులకు చికిత్స అందించాలంటే, రద్దీని తట్టుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే వున్నవి కాకుండా ఇంకా ఏయే దవాఖానాల్లో బెడ్లను పెంచాలనే విషయాలను సీఎం చర్చించారు. సరోజినీ దేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకోసం తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు. హైద్రాబాద్ లో బెడ్లు కనీసం 1100 వరకు, జిల్లాల్లో 400 వరకు మొత్తం 1500 బెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు, బ్లాక్ ఫంగస్ ను తగ్గించే మందులు ఎంత సంఖ్యలో అవసరమున్నదో అంచనా వేసి దానిమేరకు బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులను తక్షణమే ఆర్డరివ్వాలని సిఎం తెలిపారు.

అందుబాటులో వున్న ''పోసకోనజోల్'' మందు స్టాక్ తక్షణమే పెంచాలని, అందుకు తగు చర్యలు చేపట్టాలని సిఎం సూచించారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలని సిఎం అన్నారు. ''రాష్ట్రానికి పక్క రాష్ట్రాల నుంచి అటు కరోనా ఇటు బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం తరలి వస్తున్నారు. రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు వాస్తవమే. అయితే.. కరోనా చికిత్స విషయంలో నాలుగు కోట్లుగా కాకుండా అది పది కోట్లుగా అంచనా వేసుకోవాలె. మనకు ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వాల్లకు కూడా చికిత్సను అందజేయంది తప్పేటట్టు లేదు..'' అని సిఎం అన్నారు. కరోనా కంట్రోల్ చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, ఎన్ని కోట్లయినా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా వుందని, అవసరమైతే అప్పు తెచ్చయినా కరోనా కట్టడికి సిద్దంగా ఉంది''.. అని అధికారులకు సిఎం స్పష్టం చేశారు.

Next Story
Share it