Telugu Gateway
Telangana

ప్రైవేట్ స్కూళ్ళు..కాలేజీల్లో ఫీజుల నియంత్ర‌ణ‌కు క‌మిటీ

ప్రైవేట్ స్కూళ్ళు..కాలేజీల్లో ఫీజుల నియంత్ర‌ణ‌కు క‌మిటీ
X

తెలంగాణా స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ స్కుళ్ళు, కాలేజీల్లో ఫీజుల నియంత్ర‌ణకు రంగం సిద్ధం అయింది. వాస్త‌వానికి ఈ అంశంపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ విద్యార్ధుల త‌ల్లిదండ్రుల నుంచి ఎప్ప‌టి నుంచో డిమాండ్ ఉంది. అయితే సోమ‌వారం నాడు ముఖ్య‌మంత్రి కెసీఆర్ అధ్యక్షతన జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో దీనికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన అంశంపై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన...మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ...'' మన ఊరు – మన బడి '' ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.

Next Story
Share it