Telugu Gateway
Telangana

పొంగులేటి పార్టీ మార్పు వెనక 'ముఖ్య నేత'?!

పొంగులేటి పార్టీ మార్పు వెనక ముఖ్య నేత?!
X

ఎవరైనా పార్టీ మారితే గ్యారంటీగా గెలిచే అవకాశం ఉన్న పార్టీ వైపు చూస్తారు. లేకపోతే కాస్త బలంగా ఉన్న పార్టీ వైపు మారతారు. కానీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటి తాజాగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను నేరుగా టార్గెట్ చేయటంతో పిక్చర్ మరింత క్లారిటీ వచ్చేసింది. అధికారం ఉంది కదా అని అసెంబ్లీ ని సామ్రాజ్యం చేసుకుని దోచుకుంటున్నారు అని ఆరోపించాడు. తన బిల్లు లు ఆపిన మరేమి చేసినా తనను ప్రజలనుంచి దూరం చేయలేరు అన్నారు. తాను బిఆర్ఎస్ లోకి వచ్చాక కాంట్రాక్టర్ కాలేదు అని...రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను కాంట్రాక్టరుగా ఉన్నానని చెప్పారు. ఇది అంతా ఓకే కానీ...ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్లాన్ ఎంత మేర వర్క్ అవుట్ అవుతుంది అన్నదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలం చాలా పరిమితం అన్న విషయం తెలిసిందే. అలాంటి చోట పొంగులేటి ఎంత మేరకు సత్తా చాటగలరు అన్న చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లు బలంగా ఉన్న పార్టీలు. అసలు బిఆర్ఎస్ సొంత బలం అనే కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి వల్లే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు.

ఇప్పుడు కొత్తగా టీడీపీ కూడా మళ్ళీ యాక్టీవ్ అయింది. ఈ తరుణం లో పొంగులేటి నిర్ణయంపై ఆయనతో ఉన్నవారు కూడా ఒకింత గందరగోళంలో పడుతున్నారని చెపుతున్నారు. చాలా మంది కాంగ్రెస్ వైపు వెళితే బాగుంటుంది అని చెపుతుండగా పొంగులేటి మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ నిర్ణయం వెనక ఒక ముఖ్యనేత ఉన్నారని చెపుతున్నారు. అయన సూచన ప్రకారమే పొంగులేటి కదలికలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ఆ ముఖ్య నేతతో పొంగులేటి భేటీ కూడా అయ్యారు. దీని వెనక చాలా ప్లాన్స్ ఉన్నాయని ప్రచారం ఉంది. బీజేపీ లో చేరిన తర్వాత పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. తనతో పాటు తన వెంట ఉన్న వారికి కూడా సీట్లు ఇచ్చేలా బీజేపీ నుంచి అయన మాట తీసుకోనున్నారు. ఎందుకు అంటే బీజేపీ కి నిజానికి కూడా జిల్లాలో పెద్దగా పేరున్న నేతలు లేరని చెపుతున్నారు. ఎన్ని చేసినా కూడా ఖమ్మం జిల్లాలో మాత్రం బీజేపీ సత్తా చాటడం అన్నది అంత తేలికైన విషయం కాదు అని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి. అయితే పొంగులేటి ని పార్టీలోకి తీసుకోవటం ద్వారా ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్కసారిగా ఒక కీలక పార్టీగా మారటం ఖాయం అనే అభిప్రాయంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

Next Story
Share it