టార్గెట్ ఈటెల..దూకుడు పెంచుతున్న టీఆర్ఎస్
ఓ వైపు ఎన్నడూలేని రీతిలో సంక్షేమ పథకాలు. మరో వైపు ఆకర్షణలు. ఎలాగైనా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను హుజూరాబాద్ లో ఓడించాలి. ఇదే అధికార టీఆర్ఎస్ అంతిమ లక్ష్యం. ఇప్పడు ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే ఆదివారం నాడు కీలక పరిణామం జరిగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ప్రధాన అనుచరుడు, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగలి రమేష్ తాజాగా ఈటెలకు షాకిచ్చారు. ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి కారెక్కారు. బీజేపీ భావజాలలలో ఇమడలేక పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. దళిత బంధు వల్ల దళితులకు ఎంతో మేలు జరగనుందని పేర్కొన్నారు. ఈటెల కూడా అధికార టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నాయకులను కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్న చరిత్ర కెసీఆర్ దే అంటూ పలుమార్లు మండిపడ్డారు.