చిక్కుల్లో నా అన్వేషణ

అన్వేష్. యూట్యూబ్ చూసే వాళ్లకు పరిచయం అక్కరలేని పేరు. నా అన్వేషణ...ప్రపంచ యాత్రికుడు ఛానెల్ తో వివిధ దేశాల్లో పర్యటిస్తూ ఆ విషయాలతో వీడియో లు చేస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన ఛానల్ కు ఏకంగా 21 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా అన్వేష్ బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యం గా టీవీ, సినిమా సెలబ్రిటీ లు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బు ఎలా సంపాదిస్తున్నది చెపుతూ వస్తున్నాడు. బెట్టింగ్ యాప్ ల ద్వారా సెలబ్రిటీ లు అమాయక ప్రజల ప్రాణాలు పోవటానికి కారణం అవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వీటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అన్వేష్ కొద్ది రోజుల క్రితం తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు మెట్రో రైల్ ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు దానకిషోర్, వికాస్ రాజ్ తో పాటు మాజీ సిఎస్ శాంతి కుమారి పై కూడా పలు ఆరోణలు చేస్తూ ఒక వీడియో చేశాడు.
హైదరాబాద్ మెట్రో లో బెట్టింగ్ యాప్ ల ప్రచారం పేరుతో ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు కొట్టేశారంటూ వీడియో చేశాడు. అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు అంటూ హైదరాబాద్ లో సైబరాబాద్ పోలీసులు అన్వేష్ పై కేసు పెట్టారు. ప్రజల్లో గందగోళం సృష్టించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారుల పరువుకు భంగం కలిగించేలా వీడియో చేశారు అనే సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీస్ లు కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్ లకు ప్రమోట్ చేసిన సినీ సెలెబ్రిటీల పై కేసులు నమోదు చేశారు. తర్వాత ఈ వ్యవహారం అటకెక్కినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.