కోవర్టులు ఎవరో అధిష్టానం గుర్తించాలి
కాంగ్రెస్ లో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనకు వ్యతిరేక గళం విన్పిస్తూ వస్తున్నారు. శనివారం నాడు జగ్గారెడ్డి నియోజకవర్గానికి చెందిన కీలక నేతలతో భేటీ అనంతరం కార్యాచరణ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. మద్యలో సీనియర్ నేత విహెచ్ తోపాటు మరికొంత మంది జగ్గారెడ్డి తో చర్చలు జరిపారు. అయినా సరే ఆయన పలు అంశాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు లేఖలు రాశారు. లేఖలు రాసినప్పటి నుంచి తాను కాంగ్రెస్ లో లేనట్లేనని పేర్కొన్నారు. త్వరలో పార్టీ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఆయన మూడు పేజీల లేఖను విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...' పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటాను. ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుంచి కాంగ్రెస్ గుంపులో ఉండను. కాంగ్రెస్లో సడన్గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ కావొచ్చు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కోవర్టుగా ముద్రవేస్తున్నారు. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ఉన్నా హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు.
కాంగ్రెస్లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తా. పార్టీలో ఎవరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలి. 2017లో ఎవ్వరు అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టమంటే.. సభ పెట్టడానికి ముందుకు రాకుంటే నేను సభ నిర్వహించాను. ఆ సభ నుంచి పార్టీ రాష్ట్రంలో బలపడింది. పార్టీ కోసం కష్టపడినా నేనా కోవర్టుని.. సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతలు కోవర్టులా?. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పేట్టకుంటే నేను మెదక్ జిల్లా నుంచి అభ్యర్థిని పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపాను.పార్టీ సీనియర్లు ఎవరూ కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు. ఎవరు కోవర్టులు.. అభ్యర్థిని పెట్టినవాళ్లా? లేక పెట్టని వాళ్లా?. ఇటీవల హుజూరబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్లు కోవర్టులా? నేనా?. గాంధీ కుటుంబంపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది నేను. మరి పార్టీలో పదవులు అనుభవిస్తున్నవాళ్లు, స్పందించకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్టులా? లేక నేనా? అనేది అధిష్టానం గుర్తించాలి' అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.