Telugu Gateway
Telangana

మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్కపై కెసీఆర్ ప్ర‌త్యేక ప్రేమ‌!

మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్కపై కెసీఆర్ ప్ర‌త్యేక ప్రేమ‌!
X

ద‌ళిత బంధులో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికే వంద కోట్లు

మిగిలిన మూడు మండ‌లాల‌కు మాత్రం 50 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే

నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ

సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌పై ముఖ్య‌మంత్రి కెసీఆర్ ప్ర‌త్యేక ప్రేమ చూపిస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీ వైఖ‌రికి భిన్నంగా ద‌ళిత‌బంధుపై..ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించినందుకు ఆయ‌న‌కు ఈ ప్ర‌త్యేక నిధులు కేటాయింపు చేశారా?. సోమ‌వారం నాడు స‌ర్కారు జారీ చేసిన జీవో జారీ చేస్తే ఎవ‌రికైనా ఇదే అనుమానం వ‌స్తుంది. రేవంత్ రెడ్డికి పీసీసీ ప‌ద‌వి ఇవ్వ‌టం ఏ మాత్రం ఇష్టంలేని మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క ప‌లుమార్లు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ త‌రుణంలో కెసీఆర్ చూపించిన ప్ర‌త్యేక ప్రేమ కూడా ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది. సోమ‌వారం స‌ర్కారు ద‌ళిత బంధు అమ‌లు కోసం కొత్త‌గా 250 కోట్ల రూపాయ‌లు మంజూరు చేసింది.

అందులో మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ధిర ప‌రిధిలోని చింత‌కాని మండ‌లానికి మాత్రం వంద కోట్ల రూపాయ‌లు కేటాయించారు. తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తుంగ‌తుర్తి మండలానికి 50 కోట్లు, అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చ‌ర‌కొండ మండ‌లానికి 50 కోట్లు,జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని నిజాంసాగ‌ర్ మండ‌లానికి 50 కోట్ల రూపాయ‌లు మంజూరు చేశారు.. ఈమేర‌కు ఆర్ధిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌క్రిష్ణారావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. విచిత్రంగా హుజూరాబాద్ లో ఉప ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కూ ద‌ళిత‌బంధు ఆపాలంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసిన కొద్ది గంట‌ల‌కే ఈ జీవో వెలువడింది.

Next Story
Share it