Telugu Gateway
Telangana

మోడీ పై కెసిఆర్ స్టాండ్ ఎన్ని సార్లు మారుతుందో !

మోడీ పై కెసిఆర్ స్టాండ్ ఎన్ని సార్లు మారుతుందో !
X

బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తన అవసరాలకు అనుగుణంగా ఎప్పుడంటే అప్పుడు అలా అలవోకగా మాట మార్చేస్తారు. ఇది ఆయనకు ఎంతో తేలికైన పని. ఒక సారి సీఎం కెసిఆర్ అసెంబ్లీ వేదికగా దేశం లో తాను ఇంత వరకు మోడీ అంత ఉత్తమ ప్రధానిని చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. బహుశా ఇది మోడీ, కెసిఆర్ ల ఫస్ట్ టర్మ్ పరిస్థితి. దేశం అంతా వ్యతిరేకించిన కూడా సీఎం కెసిఆర్ మాత్రం పెద్ద నోట్ల రద్దుకు మద్దదు ఇవ్వటమే కాకుండా అసెంబ్లీ లో ఈ అంశంపై చర్చకు కూడా కెసిఆర్ అప్పట్లో నో చెప్పారు. తర్వాత లెక్కలు మారాయి. సీఎం కెసిఆర్ మళ్ళీ సీన్ మార్చి దేశంలో తాను ఇంత వరకు మోడీ అంత చెత్త ప్రధాని ని చూడలేదు...మోడీని , బీజేపీ ని బంగాళాఖాతంలో కలిపివేస్తే తప్ప దేశానికీ విముక్తి కలగదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం ‘మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్లే. నువ్వు గోక్కున్నా..గోక్కోపోయినా..నేను మాత్రం గోకుతూనే ఉంటా’ అంటూ మోడీపై ఎటాక్ చేశారు. కానీ కొద్ది రోజుల నుంచి ప్రధాని మోడీ విషయంలో, బీజేపీ పై కెసిఆర్ విమర్శల దాడి పూర్తిగా తగ్గిపోయింది. అసలు అవేమి పట్టనట్లు వ్యవరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ పెద్దలతో డీల్ జరిగినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి.

వీటిని బలోపేతం చేసేలా బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ గత కొన్ని రోజుల నుంచి తన వైఖరి మార్చుకున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా మహారాష్ట్ర పర్యటనలో సీఎం కెసిఆర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మీడియాలో వచ్చిన వాటి ప్రకారం సీఎం కెసిఆర్ ఇప్పుడు మోడీ తనకు మంచి మిత్రుడు అని వ్యాఖ్యానించటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నీతి ఆయోగ్ సమావేశాల్లో మోడీ తో ఆలోచనలు పంచుకుంటాం అంటూ మాట్లాడారు. తమ పథకాలు కేంద్రం అమలు చేయటం మంచిదే అంటూ ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాజాగా జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి కూడా కెసిఆర్ డుమ్మాకొట్టారు. ఆ సమావేశాల్లో ఎలాంటి చర్చలు చేసినా అమలు కావటం లేదు అని...ఇది వేస్ట్ సమావేశాలు అంటూ బిఆర్ఎస్ నేతలు అందరూ ఎటాక్ చేశారు. ఇప్పుడు మాత్రం మోడీ మంచి ఫ్రెండ్ ,,, నీతి ఆయోగ్ సమావేశాల్లో ఆలోచనలు పంచుకుంటాం అంటూ మాటలాడటం అంటే ఇది దేనికి సంకేతం అనే చర్చ సాగుతోంది. తాజా పరిణామాలు అన్ని చూస్తుంటే ఎక్కడో ఏదో సెటిల్ మెంట్ జరిగినట్లు కనిపిస్తోంది అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story
Share it