Telugu Gateway
Telangana

ఎన్నికల కోసమే మహా మెట్రో ప్రకటన

ఎన్నికల కోసమే మహా మెట్రో ప్రకటన
X

హైదరాబాద్ ప్రజలకు..రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది రంగుల ప్రపంచం చూపించటమే. అంతకు మించి ఏమీ లేదు. ఎన్నికలు వస్తున్న తరుణంలో అధికార బిఆర్ఎస్ మహా మెట్రో పేరుతో మహా మాయకు సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. నగరంలో అయినా...శివార్లలో అయినా మంచి మౌలిక సదుపాయాలు...మెట్రో ట్రైన్ సౌకర్యం కలిపిస్తే అది మంచిదే. దాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ చేసే ప్రకటనల్లో వాస్తవికత ఎంత ఉంది...అసలు ఇది ప్రభుత్వం చెపుతున్నట్లు నాలుగు, ఐదు ఏళ్లలో ఇది పూర్తి చేయటం సాధ్యం అవుతుందా అన్నదే ఇక్కడ కీలక అంశం. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం చూసిన అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. అసలు ఇది జరిగే పనేనా...ఈ ప్రతిపాదన వాస్తవ రూపం దాల్చాలంటే తక్కువలో తక్కువ మరో ఏభై ఏళ్ళు పడుతుంది అని ఒక ఐఏఎస్ అధికారి అంచనా వేశారు. ప్రస్తుతం తెలంగాణాలో భూములు అమ్మి స్కీం లు అమలు చేస్తున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందటం లేదు. గత ఎన్నికల హామీ రైతు రుణ మాఫీ ఇప్పటివరకు పూర్తి చేయలేదు. అసలు చేస్తారో లేదో అనే అనుమానాలు రైతుల్లో ఉన్నాయి.

ఇప్పుడు కొత్తగా తలపెట్టిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో పూర్తి కే మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ డబ్బులతో కడుతున్న ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ అమలుకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్నదే పెద్ద సందేహం. ఈ నెలలో శంషాబాద్ ప్రాజెక్ట్ బిడ్దర్ ఫైనలైజ్ అవుతుంది...పనులు అప్పగిస్తారు. వచ్చే నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి అయి...కొత్త ప్రభుత్వం కొలువుతీరాక కానీ ఈ పనులు ముందుకు సాగే అవకాశం లేదు. అలాంటిది సోమవారం నాటి క్యాబినెట్ లో ఏకంగా 70 వేల కోట్ల రూపాయలతో కొత్తగా 278 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ మార్గాల అభివృద్ధి, నగరం నాలు వైపులా అంటూ ప్రకటన వెలువడింది. అసలు ఈ మహా మెట్రో ప్రతిపాదన కాగితాలకు పరిమితం అవటం తప్ప ఏమీ ఉండదు అనే అభిప్రాయం అధికారుల్లో కూడా ఉంది. సీఎం కెసిఆర్ టెండర్లు ఖరారు కాకుండానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందటానికి ఈ ప్రకటన చేశారనే చర్చ సాగుతోంది. మరి సీఎం కెసిఆర్ ప్రయతనాలు ఫలిస్తాయా లేదా అన్నది తేలాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.

Next Story
Share it