Telugu Gateway
Telangana

యాదాద్రి ప్రారంభోత్స‌వానికి రండి

యాదాద్రి ప్రారంభోత్స‌వానికి రండి
X

ప్ర‌ధాని మోడీని ఆహ్వానించిన సీఎం కెసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ శుక్ర‌వారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీతో స‌మావేశం అయ్యారు. ఈ భేటీ 50 నిమిషాల పాటు జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సాగిన చ‌ర్చ‌లో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సింది గా ప్రధాని మోడీని సీఎం కేసిఆర్ కోరారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సింది గా సీఎం కేసిఆర్ ప్రధానిని ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.

సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు వున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం "తెలంగాణ భవన్" నిర్మించుకునేందుకు ఢిల్లీ లో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కేసిఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని, భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సీఎం కేసిఆర్ కు హామీ ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు.

ప్రధానికి అందించిన లేఖల వివ‌రాలు..

.౧. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి.

2. రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి.

3. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలి.

4. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.

5. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలి.

6.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.

7.ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.

8. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.

9. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.

10.రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.అనే అంశాలకు సంబంధించిన లేఖలున్నాయి.

Next Story
Share it