Telugu Gateway
Telangana

యాదాద్రిలో మార్చి28న మ‌హాకుంభ సంప్రోక్షణ

యాదాద్రిలో మార్చి28న మ‌హాకుంభ సంప్రోక్షణ
X

తెలంగాణ‌లో ప్ర‌ముఖ దేవాల‌యం యాదాద్రి పునః ప్రారంభ ముహుర్తం ఖారారైంది. వ‌చ్చే ఏడాది మార్చి 28న మ‌హాకుంభ సంప్రోక్షణ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం నాడు యాదాద్రిలో ప‌ర్య‌టించిన కెసీఆర్ మంగ‌ళ‌వారం నాడు రాత్రి మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి విశిష్ట‌త‌ల‌ను ప్ర‌స్తావించారు. మ‌హాకుంభ సంప్రోక్షణకు ముందు ఎనిమిది రోజుల ముందు మ‌హా సుద‌ర్శ‌న‌యాగం ఉంటుంద‌ని కెసీఆర్ వెల్ల‌డించారు. యాదాద్రి దేవాల‌యానికి 125 కిలోల బంగారం కావాల్సి ఉంద‌ని..త‌మ కుటుంబం త‌ర‌పున కిలో 16 తులాల బంగారం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న‌తోపాటు ప‌లువురు నేత‌లు కూడా బంగారం ఇవ్వ‌టానికి అంగీకారం తెలిపార‌న్నారు. ఈ బంగారం కూడా రిజ‌ర్వ్ బ్యాంక్ నుంచి కొనుగోలు చేస్తాం త‌ప్ప‌..మ‌రొక‌టి ఉండ‌ద‌న్నారు. ప్ర‌భుత్వం నియ‌మించే ఐఏఎస్, ఐపీఎస్ ల క‌మిటీ ఈ వ్య‌వ‌హారం చూసుకుంటుంద‌ని తెలిపారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో.. ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆల‌య అభివృద్ధ పనులతోపాటు, ప‌రిస‌రాల‌న్నింటినీ ప‌రిశీలించారు. తొలుత మధ్యాహ్నం 12.40 గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు.

అక్కడి నుంచి ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం కేసీఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు.

ఈ సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరగా, నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాం కనుక, ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయక, అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తరతరాలుగా క్షేత్రాన్ని ఆశ్రయించి బతుకుతున్న వారి బతుకుదెరువుకు ఎటువంటి భంగపాటు రానివ్వద్దని హెచ్చరించారు. చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని.. ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు. ఆలయ ప్రధాన అర్చకులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రిలో పది వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని వివరించారు.

Next Story
Share it