Telugu Gateway
Telangana

ప్రైవేట్ ఉపాధ్యాయులకు రెండు వేలు..25 కిలోలు బియ్యం

ప్రైవేట్ ఉపాధ్యాయులకు రెండు వేలు..25 కిలోలు బియ్యం
X

కరోనా కారణంగా రాష్ట్రంలో స్కూళ్లు మూసివేయటంతో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే లక్షలాది మంది టీచర్లు, సిబ్బంది నానా కష్టాలు పడుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. ఆ వివరాలు...'కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయం తో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సిఎం తెలిపారు.

ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సిఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కి లబ్ధిచేకూరుతుంది.' అని వెల్లడించారు.

Next Story
Share it