Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ మ్యానిఫెస్టో పై కనిపించని సానుకూలత!

బిఆర్ఎస్ మ్యానిఫెస్టో పై కనిపించని సానుకూలత!
X

ఎలివేషన్స్ ఎక్కువ ..విషయం తక్కువ. బిఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసిన తర్వాత ఎక్కువ మంది అభిప్రాయం ఇది. బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటనకు ముందు మంత్రి కేటీఆర్ అయితే పులి బయటకు వస్తోంది...ఇక అంతే అంటూ ఎలివేషన్స్ ఇచ్చారు. మరో మంత్రి హరీష్ రావు అయితే బిఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల అయితే ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతుంది అంటూ పదే పదే పలు సభల్లో ప్రకటించారు. ఆదివారం నాడు కెసిఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసిన తర్వాత మాత్రం వాళ్లకు ముందే మైండ్ బ్లాంక్ అయి కాంగ్రెస్ మ్యానిఫెస్టో ను కాపీ కొట్టినట్లు ఉంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు హామీలను అటు ఇటు మార్చి... కెసిఆర్ పాత పథకాలకు అదనపు జోడింపులు చేశారు తప్ప మ్యానిఫెస్టో పెద్దగా ప్రభావం చూపించేదిలా లేదు అనే చర్చ సాగుతోంది. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అందరికంటే ముందు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ మంది పాత వారే ఉండటంతో అప్పుడు కూడా పెద్దగా సీట్ల ప్రకటనపై పాజిటివ్ వైబ్రేషన్స్ రాలేదు.

ఇప్పుడు మ్యానిఫెస్టో విషయంలోనే అదే పరిస్థితి. కాంగ్రెస్ కీలక హామీలను కాపీ కొట్టడం ఒకెత్తు అయితే రైతుల కోసం ఎంతైనా చేస్తాను అని పలు మార్లు ప్రకటించిన కెసిఆర్ ఈ సారి మాత్రం లక్ష రూపాయల రైతు రుణ మాఫీ పథకాన్ని పూర్తిగా ఎత్తేసారు. ప్రచారం జరిగిన ఉచిత ఎరువుల ఊసెత్తలేదు. గతంలో ఒకసారి రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కెసిఆర్ ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చారు. యువతకు అత్యంత కీలకమైన ఉద్యోగాలు..ఉపాధి హామీ వంటి వాటి విషయంలో అసలు బిఆర్ ఎస్ మ్యానిఫెస్టో ఏ మాత్రం ఫోకస్ పెట్టలేదు. అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే గతంలో ఇలాగే ఎన్నో మాటలు చెప్పిన కెసిఆర్ వాటిలో అమలు చేసింది కొన్నే కావటంతో కొత్తగా ప్రకటించిన మ్యానిఫెస్టో ను కూడా ప్రజలు ఎంత మేరకు నమ్ముతారు అనే దానిపై పలు అనుమానాలు ఉన్నాయి. ఒకే సారి 115 మంది అభ్యర్థులను ప్రకటించినా..మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత కూడా బిఆర్ఎస్ కు ఎక్కడ పెద్దగా సానుకూల సంకేతాలు వస్తున్నా దాఖలాలు లేవు అని..ఇవన్నీ చూస్తే ఏదో లెక్క తేడా కొడుతున్నట్లే ఉంది అనే అనుమానాలు ఆ పార్టీ నేతల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it