Telugu Gateway
Telangana

తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్

తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్
X

అధికార టీఆర్ఎస్ బిజెపికి బిగ్ షాక్ ఇచ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న ఆ పార్టీ ఇటీవ‌ల కాలంలో య‌మా స్పీడ్ పెంచింది. ఈ త‌రుణంలో టీఆర్ఎస్ పార్టీ బిజెపికి ఓ ఝ‌ల‌క్ ఇచ్చింది. దేశ స్థాయి బిజెపి నేత‌లు అంద‌రూ హైద‌రాబాద్ లో అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్న వేళ ఆ పార్టీకి చెందిన న‌లుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు బిజెపికి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల‌తో పాటు తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్‎లో గూటికి వ‌చ్చారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ , రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్ , జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్ అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్ , తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్ , కౌన్సిలర్ ఆసిఫ్ లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‎లో చేరారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ , ఎమ్మెల్యే దానం నాగేందర్ , పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి కార్పొరేటర్లను మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్‎ లో చేరడం బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఈ చేరిక‌ల‌ను కూడా వ్యూహాత్మ‌కంగానే పెట్టుకున్న‌ట్లు భావిస్తున్నారు. బిజెపిపై మంత్రి కెటీఆర్ నిత్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా విమర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఆయ‌న ఏ మాత్రం ఆలోచించ‌కుండా బిజెపిపై ఎటాక్ విష‌యంలో దూకుడు చూపిస్తున్నారు.

Next Story
Share it