Telugu Gateway
Telangana

బజాజ్ ఎలక్ట్రానిక్స్ చీటింగ్!

బజాజ్ ఎలక్ట్రానిక్స్ చీటింగ్!
X

బజాజ్ ఎలక్ట్రానిక్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో అవుట్ లెట్స్ ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రజల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు పత్రికల్లో బహిరంగంగా తప్పుడు ప్రకటనలు ఇస్తూ కొనుగోలు దారులని మోసం చేస్తోంది. అక్టోబర్ నెలలో ఈ కంపెనీ ఇచ్చిన యాడ్స్ ఇదే విషయాలను బహిర్గతం చేసింది. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆక్టోబర్ 8 న పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. అందులో ప్రముఖంగా కోటి రూపాయల నగదు బహుమతి చివరి ఒక రోజు మాత్రమే అని అందులో రాసింది. చివరి ఒకే రోజు అంటే ఎవరైనా ఆ రోజుతో ఆఫర్ ముగుస్తుంది అనుకుంటారు. తిరిగి ఇదే సంస్థ మళ్లీ అక్టోబర్ 9 న ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి అందులోనూ ఈ రోజు చివరి రోజు అంటూ పేర్కొంది. ఇది చూసిన వారు ఎవరైనా అసలు ఎన్ని చివరి రోజులు ఉంటాయి అన్న సందేహం రావటం సహజం. కోటి రూపాయల నగదు బహుమతి లో ఎప్పుడు ఎంత మొత్తానికి డ్రా తీస్తారు అన్న విషయాలు ఆ యాడ్స్ లో ప్రస్తావించారు. తొలి విడత డ్రా అక్టోబర్ 11 న అని చెప్పారు. ఆ రోజు డ్రా తీశారు..తర్వాత విజేత ను ప్రకటించారు కూడా. అంటే కోటి రూపాయల నగదు బహుమతి లో ఇప్పటికే 20 లక్షల రూపాయల డ్రా అయిపోయింది ...విజేత ఎవరో కూడా చెప్పేసారు కూడా.

కానీ కంపెనీ ఇంకా గత కొన్ని రోజులుగా ఇస్తున్నయాడ్స్ లో మాత్రం ఇంకా కోటి రూపాయల నగదు అంటూ కొనుగోలు దారులను చీటింగ్ చేస్తుంది అనే ఆరోపణులు వస్తున్నాయి. మళ్లీ అదే యాడ్స్ లో 30 లక్షల రూపాయల డ్రా ఎప్పుడు, 50 లక్షల రూపాయల డ్రా ఎప్పుడు అన్న డేట్స్ ఇస్తుంది. కానీ యాడ్ లో మాత్రం కోటి రూపాయల నగదు అని మోసం చేస్తుంది. అయి పోయిన 20 లక్షలను మినహాయించి చెప్పాల్సి ఉండగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ మాత్రం కొనుగొలు దారులను తన ప్రకటనల ద్వారా తప్పు దారి పట్టిస్తోందని విమర్శలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇస్తున్న యాడ్స్ అన్నింట్లో కోటి రూపాయల నగదు బహుమతి అని చెపుతూ వస్తోంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ యాడ్స్ ప్రజలను..ముఖ్యంగా వినియోగదారులను మోసం చేసేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి ఏటా బజాజ్ ఎలక్ట్రానిక్స్ పండగల సమయంలో ఇలా యాడ్స్ ఇస్తూ కొనుగోలు దారులను ఆకట్టుకొంటుంది. ఎంత లాభం లేక పోతే ఈ కంపెనీ కొన్ని నెలల వ్యవధి లో కోటి రూపాయల నగదు బహుమతులు ఇవ్వటం సాధ్యం అవుతుంది అని ఒక వ్యాపారి ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించి మార్కెట్ నుంచి 500 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇది అందరికి తెలిసిన విషయమే. దసరా, దీపావళి పండగల సందర్భంగా భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల నగదు బహుమతి అంటూ గత కొంత కాలంగా భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తోంది.

Next Story
Share it