పోసాని ఇంటిపై రాళ్ళ దాడి
సినీ నటుడు పోసాని క్రిష్ణమురళీ ఇంటపై దాడి జరిగింది. బుదవారం అర్ధరాత్రి ఈ దాడి చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. పోలీసు సీసీటీవీ పుటేజీ ఆధారంంగా ఎవరు ఈ దాడికి పాల్పడ్డారా అన్న అంశాన్ని గుర్తించే పనిలో పడ్డారు. కొద్ది రోజుల క్రితం పోసాని వరస ప్రెస్ మీట్లు పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ప్రెస్ క్లబ్ లో పెట్టిన మీడియా సమావేశంలో అయితే ఇది మరీ హద్దులు దాటిందనే విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిపై దాడి చేసేందుకు ప్రెస్ క్లబ్ కు రాగా..పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోసాని వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి పోసాని సంజీవరెడ్డినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.