మంత్రి మల్లారెడ్డి కారుపై దాడి
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఆదివారం రాత్రి చేదు అనుభవం ఎదురైంది. అన్ని పార్టీల నాయకుల తరహాలోనే ఆయన కూడా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్ల సింహ గర్జన సభలో పాల్గొన్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడే సమయంలో దుమారం రేగింది. ఆయన తన ప్రసంగంలో సీఎం కెసీఆర్ ను పొగుడుతుండగా మంత్రి మల్లారెడ్డిపై సభికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పడంతో వారి ఆగ్రహం మరింత పెరిగింది.
పదే పదే మల్లారెడ్డి సీఎం కెసీఆర్, టీఆర్ఎస్ పేరెత్తడంతో కుర్చీలు పైకి లేపి వ్యతిరేక నినాదాలు చేశారు. అంతే కాదు.. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా చెప్పులు, రాళ్ళు విసిరేసి నిరసన తెలిపారు. దీంతో మల్లారెడ్డి మధ్యలోనే ప్రసంగం ఆపేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకుని కారుపై కుర్చీలతో దాడి చేశారు. దీంతో పోలీసులు..రోప్ పార్టీలు ఏర్పాటు చేసి మంత్రిని అక్కడ నుంచి సేఫ్ గా బయటకు పంపారు. ఈ వ్యవహారం కలకలం రేపింది.