అమీర్ పేటలో ఘోర ప్రమాదం..యువకుడి మృతి
అతి వేగం ఓ యువకుడి ప్రాణం తీసుకుంది. ఈ ప్రమాదం చూసిన వారు కూడా షాక్ కు గురవుతున్నారు. ఎందుకంటే ప్రమాదం బారిన పడిన ఓ యువకుడి తల ఏకంగా మెట్రో స్టేషన్ రైలింగ్ లో ఇరుక్కుపోయింది. దీంతో అతను అక్కడిఅక్కడే మరణించాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అమీర్పేట చౌరస్తాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అతి వేగంతో కూకట్పల్లి వైపు వెళుతూ ప్రమాదం బారినపడ్డారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష్ గుప్తా రైలింగ్ లో తల ఇరుక్కుని చనిపోయాడు. గాయపడిన రవితేజకు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు ఈ విషయాలు మీడియాకు తెలిపారు.