Telugu Gateway
Politics

వైఎస్ వివేకా హత్య కేసును వదిలేయమన్నారు

వైఎస్ వివేకా హత్య కేసును వదిలేయమన్నారు
X

వైఎస్ కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య వెనక ఉన్నది ఎవరో ఇంత వరకూ తేలలేదు. విచారణ సీబీఐకి అప్పగించినా దోషులు ఎవరో వెల్లడి కాలేదు. ఇదే అంశంపై వైఎస్ వివేకా కుమార్తె సునీత శుక్రవారం నాడు ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిశారు. అనంతం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య వెనక రాజకీయ కారణాలే ఉండి ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సునీత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...' ''ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని కలిస్తే.. కడప, కర్నూల్‌లో ఇలాంటి ఘటనలు సాధారణం అన్నారు. అయ్యిందేదో.. అయ్యింది.. నీ పోరాటం ఆపేయి.. లేదంటే నీ పిల్లలపై ప్రభావం చూపుతుందని కొంతమంది సూచించారు.

నేను ఆశ్చర్యపోయాను. ఏది సరైందన్న ఆలోచనలో పడ్డాను. నా పిల్లల గురించి ఆలోచిస్తూ స్వార్థపరురాలిగా ఉండిపోవాలా అనిపించింది. నేను రాజకీయ వేత్తను ... సామాజిక కార్యకర్తను కాదు. మానాన్న ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి. అంతటి వ్యక్తికే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి మరణించాడు. విచారణ ఆలస్యమైతే.. రేపటి రోజున సాక్షులు కూడా ముందుకు రారు. న్యాయం కోసం ఇంకెంత కాలం నిరీక్షించాలి'' అని ఆమె అన్నారు. హత్య జరిగి రెండేళ్లు దాటినా ఇంతవరకు హంతకులను పట్టుకోలేదు. న్యాయం కోసం ఇంకెంతకాలం వెయిట్‌ చేయాలి. జస్టిస్‌ డిలేడ్‌ ఇజ్‌ జస్టిస్‌ డినైడ్.

ఈ అన్యాయంపై పోరాటంలో నాకు అందరి సహకారం కావాలి. హత్య వెనుక ఎవరున్నారో విచారణ అధికారులు నిగ్గుతేల్చాలి. నాన్న హత్య మా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ కేసులో ఒక్కరినీ అరెస్ట్‌ చేయకపోవడం విచారణపై సందేహం కలుగుతోంది. నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కేసు సీబీఐ చేతిలోకి వెళ్లినా ఇంకా ఎలాంటి పురోగతి లేకపోవడం విచారకరం. సాక్ష్యాలు ఎక్కడ తారుమారు అవుతాయోననే సందేహం కలుగుతోంది. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. నాన్న హత్య మిస్టరీగానే మిగిలిపోయింది. హైకోర్టులో వేసిన పిటీషన్ లో నాకు అనుమానం ఉన్న వారి పేర్లు రాశా. అనుమానితుల జాబితాలో ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సహా పలువురి పేర్లను పిటీషన్ లో పేర్కొన్నా' అని తెలిపారు.

Next Story
Share it