ఏపీ ప్రజలు తెలంగాణ పథకాలు కోరుకుంటున్నారు

ఆ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పెట్టమంటున్నారు
ప్లీనరీలో కెసీఆర్ కీలక వ్యాఖ్యలు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పదవ సారి టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అనంతరం పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ దళిత బంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారని, తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మంచి పథకాలు అమలవుతున్నాయని, ఆ రాష్ట్రంలో మమ్మల్ని కూడా కలపాలని కోరుతూ నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చిన విషయాన్ని కెసీఆర్ గుర్తుచేశారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు వచ్చి పని చేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు.
సాహసం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయి. తెలంగాణలో అద్భుతంగా వ్యవసాయ స్థీరీకరణ జరిగిందని తెలిపారు. మనం విడిపోయిన ఏపీ తలసరి ఆదాయం రూ. 1.70 లక్షలు ఉంటే... తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.35 లక్షలకు పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ సమస్యలు వస్తాయని కొందరు ఏపీ నేతలు అపోహలు సృష్టించారు. కానీ తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఆంధ్రాలో 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతందని సీఎం కేసీఆర్ తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అపోహలు..అపనమ్మకాలు ఉండేవని..అన్నింటిని అధిగమించి రాష్ట్ర లక్ష్యాన్ని అందుకోగలిగామని తెలిపారు. ఆ సమయంలో సమైక్య పాలకులు పెట్టని తిప్పలు లేవని..వేయని నిందలు లేవన్నారు. తెలంగాణ పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.



