టీఆర్ఎస్.బిజెపి రెండూ ఆహ్వానించాయి
తెలంగాణలో రాజకీయాల్లో ఊహించని మార్పులు వస్తున్నాయని తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ వ్యాఖ్యానించారు. తనను టీఆర్ఎస్, బిజెపిలు రెండూ ఆహ్వానించాయన్నారు. రమణ సోమవారం నాడు జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ మార్పు విషయంలో జగిత్యాల ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని..అదే విధంగా ముందుకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఎల్.రమణ తెలిపారు. 27 ఏళ్లుగా ఇక్కడి ప్రజలతో ఉన్నానన్నారు. పదవుల కోసం పాకులాడనని, ఇతరుల పదవులకు అడ్డుపడనని తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసం తన విధానం మార్చుకోనన్నారు. ''చంద్రబాబు నాకు నా కుటుంబానికి ఎంతో చేశారు. టీడీపీ రెక్కల కష్టం నుంచి రమణ ఎదిగాడు... నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు'' అని రమణ స్పష్టం చేశారు.
తాను పదవులు డిమాండ్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలోఎలాంటి వాస్తవం లేదన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేయటంతో అధికార టీఆర్ఎస్ మరో బీసీ నేత కోసం అన్వేషణ ప్రారంభించింది. అందులో భాగంగానే రమణను ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ..ఈ అంశంపై ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.