తిరుపతిలో వైసీపీ..సాగర్ లో టీఆర్ఎస్
తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీకి, ఏపీలో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం రాత్రి వెల్లడి అయ్యాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ తన సీటును నిలబెట్టుకోనున్నట్లు పలు సంస్థలు అంచనా వేశాయి. ఇక్కడ కాంగ్రెస్ తరపున జానారెడ్డి, టీఆర్ఎస్ తరపున నోముల భగత్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ స్పష్టమైన ఆదిక్యతతో ఉన్నట్లు పలు సంస్థలు స్పష్టం చేశాయి.
తిరుపతిలో కూడా వైసీపీ భారీ మెజారిటీ గెలవబోతున్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది. ఇక్కడ అధికార వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి బరిలో నిలవగా, టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, బిజెపి తరపున రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ బరిలో నిలిచారు. అటు నాగార్జున సాగర్ తోపాటు తిరుపతిలో బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మే2న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.