Telugu Gateway
Politics

ద‌శాబ్దాలుగా నిర్మించిన ఆస్తుల‌ను అమ్మేస్తున్నారు

ద‌శాబ్దాలుగా నిర్మించిన ఆస్తుల‌ను అమ్మేస్తున్నారు
X

సీనియ‌ర్ నేత‌ల‌పై సోనియా ఫైర్

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సొంత పార్టీ నేత‌ల‌పై ఫైర్ అయ్యారు. అంత‌ర్గ‌త అంశాల‌పై మీడియాలో మాట్లాడటం మంచిదికాద‌ని..ఏదైనా స‌రే పార్టీ వేదిక‌ల‌పైనే మాట్లాడాల‌న్నారు. తాను పూర్తి స్థాయి అధ్యక్షురాలిని, పూర్తి స్థాయి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను.కాంగ్రెస్‌ పునరుజ్జీవనమే అంతా కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు. అందుకోసం నేతల మధ్య, ఐక్యత, క్రమశిక్షణ అవసరమ‌న్నారు. పార్టీ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. కరోనా వల్లే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక ఆలస్యమైందని సోనియా గాంధీ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లఖింపూర్‌ ఖేరి ఘటన, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలపై సీడబ్ల్యూసీలో చ‌ర్చించారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌లు భ‌రించ‌లేనంత స్థాయిలో పెట్రోల్, డీజిల్ రేట్ల‌ను పెంచుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌లు అంశాల‌పై ప్ర‌ధాని మౌనం దేశానికి తీవ్ర న‌ష్టం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రాల డిమాండ్ మేర‌కే వ్యాక్సిన్ విధానంలో మార్పులు చేశార‌ని అన్నారు. స‌రిహ‌ద్దుల‌తోపాటు ప‌లు అంశాల్లో దేశం ప‌లు స‌వాళ్ళ‌ను ఎదుర్కొంటోంద‌ని పేర్కొన్నారు. దేశ ఆర్ధిక ప‌రిస్థితి కూడా దారుణంగా ఉంద‌ని, ఆర్ధిక పున‌ర్జీవానికి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలేద‌న్నారు. ద‌శాబ్దాల కాలం నాడు నిర్మించిన ఆస్తుల‌ను అమ్మేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల వారి సాధికారిక‌త ప్ర‌మాదంలో ప‌డింద‌ని సోనియాగాంధీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎంపిక‌చేసిన ప్రైవేట్ సంస్థ‌ల‌కు మేలు చేసేందుకు రైతు చ‌ట్టాల‌ను తెచ్చార‌న్నారు. ఏడాదిగా రైతులు దీనిపై ఆందోళ‌న‌లు చేస్తున్నా ప్ర‌భుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంద‌న్నారు. ఈ న‌ల్ల‌చ‌ట్టాల ఆమోదం కోసం అంద‌రిని నర‌క‌యాత‌న‌కు గురిచేశార‌ని చెప్పారు. ల‌ఖింపూర్ ఘ‌ట‌న బిజెపి మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టింద‌ని, రైతుల ప‌ట్ల బిజెపి వైఖ‌రి ఇది తెలియ‌జేస్తోంద‌ని వ్యాఖ్యానించారు.

Next Story
Share it