కాంగ్రెస్ లోకి సామ వెంకటరెడ్డి
టీఆర్ఎస్ కు చెందిన కీలక నేత సామ వెంకటరెడ్డితోపాటు మరి కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వీరంతా బుధవారం నాడు ఢిల్లీలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. సామ వెంకటరెడ్డి ప్రస్తుతం తెలంగాణ కనీస వేతన సంఘం ఛైర్మన్ గా ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు లోనవుతున్నారని, వారంతా కెసీఆర్ పై విశ్వాసం కోల్పోయారన్నారు. ఏ ఆశయం కోసమైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో ఆ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదన్నారు. నిరుద్యోగులకు తెలంగాణలోని ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించాలని సామ వెంకట్ రెడ్డి తొలి నుంచి ఉద్యమాలు చేశారని రేవంత్ గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కూడా వెంకట్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల భూములు గుంజుకుని తక్కువ ధరకే పరిశ్రమలకు కేటాయించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సామ వెంకటరెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రైవేట్ సంస్థల్లో కూడా 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చట్టం తేవాలని కోరితే ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఏపీ, కర్ణాటకల్లో ఇలాంటి చట్టాలు తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పెగాసెస్ స్పైవేర్ తో ఫోన్ల ట్యాపింగ్ చేసిన అంశంపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ గురువారం రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.