Telugu Gateway
Politics

కెసీఆర్ ను రోడ్డున ప‌డేలా చేస్తాం

కెసీఆర్ ను రోడ్డున ప‌డేలా చేస్తాం
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోసారి ముఖ్య‌మంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్, డీజీపీల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పోలీసులే కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు అప్ప‌గిస్తే..వాళ్లు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల త‌ల‌లు ప‌గ‌ల‌గొట్టార‌ని ఆరోపించారు. ఇదే అంశంపై తాను ఎస్సీతోపాటు ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తోనూ మాట్లాడాన‌న్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకే డీజీపీకి ప‌లుమార్లు ఫోన్ చేసి ఆయ‌న క‌నీసం తిరిగి కాల్ కూడా చేయ‌లేద‌ని..ఓ ఎంపీతో..పార్టీ ప్రెసిడెంట్ తో వ్య‌వ‌హ‌రించే తీరు ఇదేనా అంటూ మండిప‌డ్డారు. రేపటి నుంచి తాము అంతా రోడ్ల మీదే ఉంటామ‌న్నారు. కెసీఆర్ ను రోడ్డుమీద‌కు ఈడ్చేవ‌ర‌కూ ఎవ‌రు కూడా విశ్ర‌మించ‌కూడ‌ద‌న్నారు. కెసీఆర్ కు గుణ‌పాఠం చెపితే త‌ప్ప మ‌న‌కు విముక్తి క‌ల‌గ‌దు అని వ్యాఖ్యానించారు. కెసీఆర్ కు నిర‌సన సెగ ఏంటో చూపిస్తాం. పోలీసుల‌తో అడ్డుకుంటామ‌ని అనుకుంటున్నారో..ఉద్య‌మ స‌మ‌యంలో ఎలా చేశారో అలాగే చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర సంపదను సీఎం కేసీఆర్ కొల్లగొట్టారని దుయ్యబట్టారు. ఓయూ విద్యార్థులు నిరుద్యోగ దినోత్సవం చేస్తే.. టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని తెలిపారు. దరిద్రుడు సీఎం కావడం వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూడ్రోజుల వేడుకలు అవసరమా? ఎవరైనా చనిపోతే మూడు రోజుల సంతాప దినాలు చేస్తారు. పుట్టినరోజుకు కాదు ఈ సంగ‌తి కూడా కెటీఆర్ కు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. పోలీసులు వాళ్లు ఏమి చెపితే అది డూడూ బ‌స‌వ‌న్న‌లా చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే అని అప్పుడు బ‌య‌ట‌కు లాక్కొచ్చి అంద‌రి జాత‌కాలు చెబుతామ‌న్నారు. అప్ప‌ట్లో న‌క్స‌లైట్లు ఉంటే ప్ర‌గ‌తి నిరోధ‌కులు అన్న అభిప్రాయం ఉండేద‌ని..కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూసిన త‌ర్వాత న‌క్సలైట్లు ఉంటే అయినా ఈ ద‌రిద్రులు భ‌య‌ప‌డేవారు అన్న అభిప్రాయం వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు.

Next Story
Share it