Telugu Gateway
Politics

మోడీ కోసం రష్మిక పెయిడ్ ప్రమోషన్!

మోడీ కోసం రష్మిక పెయిడ్ ప్రమోషన్!
X

రష్మిక మందన్న. ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరస సినిమాలు చేస్తూ ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. ఇటీవలే రష్మిక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పక్కన సికందర్ మూవీ లో నటించబోతున్నట్లు వెల్లడించింది. ఇది సినిమాల విషయం. ఇక అసలు విషయానికి వస్తే రష్మిక మందన్న ఇప్పుడు ఒక రాజకీయ వివాదం లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. సడన్ గా ఆమె అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికల వేళ కేంద్రంలో మోడీ సర్కారు అనుకూలంగా మాట్లాడటం...దీనిపై సోషల్ మీడియా లో ఒక వీడియో షేర్ చేయటంతో ఒక్కసారిగా రష్మిక రాజకీయ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో హాట్ హాట్ చర్చ ప్రారంభం అయింది. ఆమె ప్రధాని మోడీ కోసం పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు అంటూ నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెట్టారు. తొలుత రష్మిక ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు ప్రాజెక్ట్ పై స్పందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వల్ల రెండు గంటల ప్రయాణ సమయం ఇరవై నిమిషాలకు తగ్గింది అని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ తో ముంబై నుంచి నవీ ముంబై కి ప్రయాణం ఎంతో సులభం అయింది అన్నారు. తొలుత రష్మిక ఈ ప్రాజెక్ట్ పైనే ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. తర్వాత దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో చేపట్టిన ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కలిపి ఒక వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

తొలుత అటల్ సేతు ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే దానిపై ప్రయాణించి తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు అని ఎక్కువ మంది భావించారు. కానీ తర్వాత వీడియో చూస్తే ఇది మోడీ ప్రభుత్వం కోసం చేసినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆమె కేవలం అభివృద్ధి గురించి చెప్పి ఆగిపోలేదు...యువ భారతం అత్యంత వేగంగా..తెలివిగా దూసుకెళుతోంది. ఇప్పుడు మనం అభివృద్ధికి ఓటు వేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఇదే కారణంతో రష్మిక పై కొంత మంది సోషల్ మీడియా లో ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. మణిపూర్ లో మహిళలపై దారుణమైన దాడులు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు...మోడీ యువతకు ఇస్తానన్న కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా...దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యకు కారణం అయిన విషయం కనపడదా అంటూ ఎటాక్ స్టార్ట్ చేశారు. మరి కొంత మంది రష్మిక కు మద్దతుగా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో పై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఆమె వీడియో ను మోడీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసి ...ప్రజల జీవితాలను మెరుగుపర్చడం...వారి జీవితాలను అనుసంధానం చేయటం కంటే సంతృప్తి ఏమి ఉంటుంది అని పోస్ట్ పెట్టారు. ఇది అంతా చూస్తే ఈ వ్యవహారం ఒక ప్లాన్ ప్రకారమే సాగినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it