Telugu Gateway
Politics

రాహుల్ పాద‌యాత్ర‌తో రండి

రాహుల్ పాద‌యాత్ర‌తో రండి
X

తెలంగాణ సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని విజ్ఞ‌ప్తి చేశారు. అంతే కాదు..ఆయ‌న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వ‌ర‌కూ పాదయాత్ర చేయాల‌న్నారు. ఇది ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తుందని సీఎల్పీ నేత వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణానికి సంబంధించి నేర్పు, విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షపదవి స్వీకరించాలని కోరుతూ సీఎల్పీ పక్షాన లేఖ రాస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ఉన్న ఉద్యోగాలు నిలబెట్టుకోలేక, కొత్త ఉద్యోగాల కల్పన జరగక యువత నిరాశలో ఉంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూలుస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో నేడు దేశమంతా అతలాకుతలమై తల్లడిల్లుతోంది. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తూ.. లక్షలాది మరణాలకు కారణమైందని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న సందర్భంలో.. ''దేశానికి ముప్పు దాపురించి ఉంది.. త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజానీకం మూల్యం చెల్లించాల్సి వస్తుంది'' అని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, ప్రభుత్వాన్ని హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. రాహుల్ గాంధీ విజన్ ను, ఆయన మాటలను దేశ ప్రధాని మోదీ పట్టించుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని భట్టి చెప్పారు. కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు గత 70 ఏళ్లుగా ఎన్నో రకాల వ్యవస్థలను దేశ ప్రజల కోసం నిర్మాణం చేశాయి. ప్రజలు సుభిక్షంగా జీవించేందుకు అవసరమైన అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రూపొందించాయి. అందులో భాగంగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వం రంగ సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు.. సహా ఎన్నింటినో నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిందన్నారు. ఇవాళ దేశం మీద ఏ మాత్రం అవగాహలేని పాలకులు, కేవలం ప్రచార్భాటం, మాటలతో బతికే ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను కూలుస్తున్నాడన్నారు. దేశ ప్రజలంతా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకువచ్చాడని చెప్పారు. ఉద్యోగాలు లేక యువత నిరాశతో ఉందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ వ్యవస్థల ద్వారా అనేక రకాల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు క‌ల్పించాయి.

కానీ మోదీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి ఉద్యోగాలు లేకుండా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానిక పెట్టడం ద్వారా దేశ నిర్మాణాన్ని మోదీ ఫణంగా పెట్టారని విమర్శించారు. ప్రజారోగ్యాన్ని పక్కకు పెట్టి.. కరోనాతో కొన్ని లక్షలమంది చనిపోవడానికి మోదీ కారణమయ్యారని అన్నారు. కరోనా ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాన లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. లాక్ డౌన్ పెట్టడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల లక్షలమంది వలస కూలీలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కొన్ని నెలలుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నిరుద్యోగ యువత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, వ్యవసాయ రంగం కుప్పకూలే పరిస్థితులు దాపురించాయని అన్నారు. మొత్తం దేశ భవిష్యత్తే అంథ‌కారంగా మారుతోందన్నారు.

Next Story
Share it