పండగ రోజుల్లో నోటీసులిస్తారా?
ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు స్పందించారు. ఆయన బుధవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు మౌనంగా ఉండి పండగ రోజుల సమయంలో నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. సంక్రాంతి పండగ ప్రాశస్త్యం సీఎం జగన్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు తెలుసా? అన్నారు. పాత కేసుల విచారణ కోసం ఈ నెల 17న విచారణకు రావాల్సిందిగా తనకు నోటీసులు ఇచ్చారన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ తాను విచారణకు హాజరు అవుతానన్నారు. సీఐడీ విచారణ తీరుపై కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీలో ఉన్న రావణ పాలన పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ఎంఐజీ ఇళ్ళ స్థలాల అమ్మకంపై కూడా రఘురామక్రిష్ణంరాజు సెటైర్లు వేశారు. రోడ్లు వేయటానికే నిధులు లేవని..వీళ్ళు స్థలాల్లో మౌలికసదుపాయాలు ఎలా కల్పిస్తారన్నారు. ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే వాటిని డెవలప్ చేస్తారని..హ్యాపీనెస్ట్ కు డబ్బులు కట్టిన వారి పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలన్నారు.