Telugu Gateway
Politics

ప్రియాంక..రాహుల్ రూటు మార్చారా?

ప్రియాంక..రాహుల్ రూటు మార్చారా?
X

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ రాహుల్, ప్రియాంక గాంధీ దూకుడు పెంచారు. ఓ వైపు కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు అసమ్మతి రాగం విన్పిస్తుంటే వీరిద్దరూ మాత్రం తమ తమ ప్రచారపు పనుల్లో బిజీగా ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ తాజాగా చెన్నయ్ లో గతానికి భిన్నంగా అందరితో కలసి పోయేలా పలు కార్యక్రమాల్లో పాల్గోన్నారు. స్టూడెంట్స్ తో కలసి డ్యాన్స్ లు వేయటంతోపాటు విద్యార్ధులకు ధీటుగా ఎక్సర్ సైజ్ లు చేసి ఆకట్టుకున్నారు. కేరళలోనూ అకస్మాత్తుగా సమద్రంలోకి దిగి ఈత కొట్టడంతోపాటు జాలర్లతో కలసి చేపలు పట్టారు. ఈ పరిణామాలు అన్నీ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రూట్ మార్చినట్లు కన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇప్పుడు ప్రియాంక కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆమె ఎన్నికలు జరగనున్న అసోంలో పర్యటిస్తున్నారు. ఆమె మంగళవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిశ్వనాధ్ ప్రాంతంలోని సాధురు టీ తోటల్లో వెళ్లి కూలీలతో మాట కలిపారు. అంతే కాదు..కాసేపు వారితో కలసి తేయాకు కోశారు.. ఆ తర్వాత వారితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తేయాకు కూలీలు అసోంకే కాకుండా దేశానికి కూడా ఎంతో కీలకమైన వారు అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

Next Story
Share it