Telugu Gateway
Politics

ఇది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం కాదు..కెసీఆర్ ఫ్యామిలీ ప్ర‌భుత్వం

ఇది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం కాదు..కెసీఆర్ ఫ్యామిలీ ప్ర‌భుత్వం
X

తెలంగాణ‌లో ఉన్న‌ది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం కాద‌ని..ఇది సీఎం కెసీఆర్ ఫ్యామిలీ ప్ర‌భుత్వం అని బిజెపి సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఇంట్లోనే మంత్రులంతా ఉన్నారు. ' నేను..నా కొడుకు..నా కూతురు, నా అల్లుడు ' అన్న చందంగా ఈ ప్ర‌భుత్వం ఉంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ మంగ‌ళ‌వారం నాడు కామారెడ్డి జిల్లా నిజాంసాగ‌ర్ వ‌ద్ద తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ‌లో ల‌క్ష మంది ఉద్యోగులు ప‌ద‌వి విర‌మ‌ణ చేస్తే ...కొత్త ఉద్యోగాలు మాత్రం నియ‌మించ‌లేద‌న్నారు. రాష్ట్రంలో కుటుంబ పాల‌న‌, అవినీతి పాల‌న మాత్ర‌మే సాగుతుంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణలో రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో జరిగేది ఉద్యమమేనని ప్రకాష్ జవదేకర్ అన్నారు.

తెలంగాణలో ప్రజా పాలన నడవడం లేదని, కేవలం కుటుంబ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. సీఎం పీఠం ఎక్కగానే కేసీఆర్ హామీలను మర్చిపోయారని విమర్శించారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.ప్రజల్ని మభ్యపెడుతోన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాల పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రాలకు నిధులు పెంచారని ఆయన తెలిపారు. తెలంగాణలో హైవేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. యాత్ర ద్వారా ప్రజా సమస్యలను బండి సంజయ్ తెలుసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం బీజేపీదేనని ఆయన అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ప్రకాష్ జవదేకర్ ధీమా వ్యక్తం చేసారు.

Next Story
Share it