Telugu Gateway
Politics

బిజెపి మాకు పోటీనే కాదు

బిజెపి మాకు పోటీనే కాదు
X

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బిజెపి నేతలు టూరిస్ట్ ల్లా వస్తుంటారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే. బీజేపీ అసలు పోటీనే కాదన్నారు. ఖమ్మంకు స్మార్ట్‌ సిటీ కావాలని బీజేపీ ప్రభుత్వాన్ని అడిగాం. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఖమ్మంను స్మార్ట్‌ సిటీగా ప్రకటించలేని బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ మండిపడ్డారు. ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. 'నేను ఎప్పుడూ మంత్రి పదవి ఆశించలేదు. రెండు రోజుల క్రితం ఓ బత్తాయి వచ్చింది. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తొండి సంజయ్‌.

కార్పొరేషన్‌ ఎన్నికల్లో నాలుగు ఓట్లు రాబట్టుకోవడం కోసమే ఆయన పర్యటించారు. టీఆర్‌ఎస్‌పై కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగించాం అనే వ్యాఖ్యలకు సమాధానంగా.. ఖమ్మంలో ఎటువంటి వ్యాక్సిన్‌లు పనిచేయవు. వ్యాక్సిన్‌ వేసినా తిప్పికొట్టేందుకు ఇక్కడ ప్రజలకు బాగా రోగ నిరోధక శక్తి ఉంది. కూకట్‌పల్లి డివిజన్‌లో ఏడు కార్పొరేటర్లలో ఆరు గెలుచుకొని బండి సంజయ్‌కు నేను వ్యాక్సిన్‌ వేశాను' అని పేర్కొన్నారు. నాపై చేసిన ఆరోపణలు 2023వరకు కాదు.. దమ్ముంటే ఇప్పుడు నిరూపించు అంటూ సవాల్‌ విసిరారు. నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు.

Next Story
Share it