Telugu Gateway
Politics

ప్రత్యేక సమావేశాల్లోపు కమిటీ నివేదిక ఇస్తుందా!

ప్రత్యేక సమావేశాల్లోపు కమిటీ నివేదిక ఇస్తుందా!
X

సెప్టెంబర్ నెల దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేనంత వేడి పుట్టించనున్నట్లు కనిపిస్తోంది. వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ దిశగానే సాగుతున్నాయి. అసలు ప్రధాని నరేంద్ర మోడీ ప్లాన్ ఏంటి?. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఇంత ఆగమేఘాల మీద కమిటీ వేసి నిర్ణయం తీసుకోవటం సాధ్యం అవుతుందా?. ప్రచారం జరుగుతున్నట్లు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దీని కోసమే అయితే ఈ సమావేశాలు ప్రారంభం కావటానికి ఇంకా పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది. అత్యంత కీలకమైన, ఎన్నో రాజ్యాంగ సవరణలతో కూడిన ఇంతటి సంచలనం నిర్ణయం తీసుకోవటానికి పదిహేను రోజుల సమయం సరిపోతుందా? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే దీనిపై మరో అనుమానం కూడా లేకపోలేదు. ఇప్పటికే చేయాల్సిన పనులు అన్నీ తెర వెనక చేసుకుని ఇప్పుడు కమిటీ పేరుతో తాము అనుకున్న పని చేయాలనే ప్లాన్ లో ఉన్నారా అనే అనుమానాలు కూడా చాలా మంది లో ఉన్నాయి. మోడీ సర్కారు ఎవరూ ఊహించని విధంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి మిగిలిన పార్టీలకు షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. స్పెషల్ సెషన్ సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు అంటూ తేదీలను కూడా ఖరారు చేసింది. ఐదు రోజులపాటు ఈ సమావేశాలు ఉంటాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఇప్పుడు శనివారం నాడు ఒకే దేశం..ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అద్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఇందులో సభ్యులుగా కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. సాధ్యమైనంత త్వరగా ఈ హై లెవెల్ కమిటీ తన నివేదిక ఇవ్వాలని నోటిఫికేషన్ లో సూచించారు. కొద్ది రోజుల క్రితం వరకు మోడీ కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని బలంగా ప్రచారం జరిగింది. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమితులు అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విస్తరణ సమయంలో తన రాజీనామా ఉంటుంది అని ప్రకటించారు. ఎప్పుడు ఎన్నికలు ఉన్నా ఆయా రాష్ట్రాలకు క్యాబినెట్ లో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు మోడీ. కానీ ఇప్పుడు అత్యంత కీలక రాష్ట్రాలు అయిన తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ , మిజోరం ల అసెంబ్లీ ఎన్నికలు ఉండగా క్యాబినెట్ విస్తరణను పక్కన పెట్టారు అంటే మోడీ ఈ అసెంబ్లీల తో పాటే లోక్ సభ కు ఎన్నికలకు సిద్ధం అయినట్లు కనిపిస్తోంది అనే చర్చ బలంగా సాగుతోంది. విపక్షాల ఇండియా కూటమి దూకుడుతో మోడీ లో టెన్షన్ మొదలైంది...అదే సమయంలో పదేళ్ల పాలనకు సంబధించి వ్యతిరేకత కూడా మరో కీలక అంశంగా ఉండనుంది.ఈ నెలాఖరు లోపు దేశ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it