Telugu Gateway
Politics

ఏపీ రాజధాని ఒకటా..మూడా ..లేక..!

ఏపీ రాజధాని ఒకటా..మూడా ..లేక..!
X

ఒకప్పుడు సీఎం జగన్ గురించి వైసీపీ నేతలు మాట తప్పడు..మడమ తిప్పడు అని చెప్పేవారు. ప్రచారం చేసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు జగన్ ఎప్పుడు ఏమి చెపుతారో తెలియదు అన్న చందంగా తయారు అయింది పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో అధికార వైసీపీ కి చెందిన మంత్రుల ప్రకటనలు చూస్తుంటే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలకు విలువ ఉంటుందా...లేక మంత్రుల మాటలకు ఎక్కువ విలువా అన్న సందేహం రావటం ఖాయం. లేకపోతే నేను చెప్పింది పక్కన పెట్టి మీరు మాత్రం అలాగే మాట్లాడండి అని సీఎం జగన్ మంత్రులకు డైరెక్షన్స్ ఇస్తున్నారా అన్న అనుమానం రాక మానదు. ఎందుకు అంటే సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఆయనే మూడు రాజధానులు అంటూ శాసనసభలోనే ప్రకటన చేశారు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూల్ న్యాయ రాజధాని అని. ఇదే జగన్ ప్రతిపక్షంలో ఉండగా కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అమరావతి రాజధానికి అంగీకరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత రాజకీయంగా వాడు కునేందుకు తాను అమరావతి ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. చంద్రబాబు కు ఇక్కడ ఇల్లు కూడా లేదు...అసలు జగన్ ఎందుకు రాజధాని మారుస్తారు అంటూ వైసీపీ నేతలు మీడియా ముందు ఊదరగొట్టారు కూడా. సీన్ కట్ చేస్తే తర్వాత ఏమి జరిగిందో అందరికి తెలుసు. అసెంబ్లీలో మూడు రాజధానుల కోసం ఏకంగా చట్టం చేశారు..హై కోర్ట్ మాత్రం అమరావతే రాజధాని అని చెప్పింది.

కొద్ది రోజుల క్రితం మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా మూడు రాజధానులు అన్న ప్రచారం తప్పు...పాలన అంతా వైజాగ్ నుంచే అని ప్రకటించారు. అయన ఒకడుగు ముందుకు వేసి విశాఖపట్నం రాజధానిగా ప్రకటించాక పోతే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ సంచలన వ్యాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా మూడు రాజధానులు అన్నది మిస్ కమ్యూనికేషన్ అంటూ తాజాగా బెంగళూరు లో వ్యాఖ్యానించారు. కర్నూల్ లో హై కోర్ట్ ప్రిన్సిపాల్ బెంచ్ మాత్రమే ఉంటుంది అని...గుంటూరులో ఒక సారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అని చెప్పారు. మరి అలాంటి అప్పుడు అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం ఎలా చేసినట్లు...స్వయంగా జగన్ న్యాయ రాజధాని, శాసన రాజధాని, పరిపాలన రాజధాని అని ఎలా చెప్పినట్లు. అసలు మిస్ కమ్యూనికేషన్ ఎక్కడ నుంచి వచ్చింది...ఎవరినుంచి వచ్చింది అన్నది ఆంధ్ర ప్రదేశ్ మంత్రులే చెప్పాలి. సీఎం జగన్ చెప్పిన దానికి బిన్నంగా అటు ధర్మాన అయినా...ఇటు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అయినా చెప్పగలరా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. దీంతో ఇది అంతా సీఎం జగన్ కనుసన్నుల్లో సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది అని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది అంతా చూసిన వాళ్ళు నాలుగేళ్ళ తర్వాత కూడా జగన్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని తో ఆడుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it